ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్న, కోట్లాది మందిని కటిక పేదరికంలోకి నెట్టేస్తున్న అత్యంత తీవ్రమైన మహమ్మారి కరోనా అని ఆర్థికవేత్తలు అంగీకరిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 5.2 శాతం కుదించుకుపోతుందని గత 150 ఏళ్లలో ఎన్నడూ చూడనంతగా పతనమవుతుందని ప్రపంచ బ్యాంకు జోస్యం చెప్పింది. ఆ నివేదిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలు దశాబ్దాలు శ్రమించి సాధించిన పురోగతిని కరోనావైరస్ కాలరాస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థికవ్యవస్థలను మాంద్యంలోకి పడదోస్తోంది.కరోనా సంక్షోభం అనేక సంస్థలను దివాళా తీయిస్తోంది. ఎంతో పేరున్న ప్రముఖ సంస్థలు సైతం కరోనా లాక్ డౌన్ దెబ్బకు కస్టమర్లు రాక నిర్వహణ గుదిబండలా తయారవుతుంటే కోలుకోలేక నడవడానికి కిందా మిందా అవుతున్నాయి. మొదటి విడుత సంక్షోభం నుండి కోలుకుంటున్న తరుణంలోనే రెండో వేవ్ రావడం ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రముఖ సంస్థలు దివాళా అంచుకు చేరుకుంటున్నాయి. పర్యాటకులు లేక హోటల్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. దేశ ఆర్ధిక రాజధాని ముంబయిలో లాక్ డౌన్ చాలా కాలం అమలు చేయడంతో అనేక సంస్థలు విలవిలలాడుతున్నాయి.
చిన్నా చితక సంస్థలే కాదు. ప్రముఖమైనవి కూడా చేతులెత్తేస్తున్నాయి. ఇదే కోవలోనే ఫైవ్ స్టార్ హోటల్ హయత్ రీజెన్సీ సైతం తన సిబ్బందికి, ఉద్యోగులకు జీతాలు చెల్లించలేక చేతులెత్తేసింది. తాత్కాలికంగా మూసివేస్తున్నామని ప్రకటించింది. ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలోనే ఉన్న హయత్ హోటల్ నిర్వహణ భారంతో తాత్కాలికంగా మూసివేస్తున్నామన సంస్థ ప్రకటించడం హోటల్ పరిశ్రమ వర్గాల్లో తాజా పరిస్థితికి అద్దం పట్టింది. నిన్నటి వరకు కస్టమర్లే మా దేవుళ్లు అని ఆయా సంస్థల్లో కనిపించే ఆకర్షణీయమైన కొటేషన్ల వెనుక అర్థం పరమార్థం కరోనా వల్ల ఇప్పుడు అందరికీ అర్థమయ్యేలా చేస్తోంది. అంతర్జాతీయంగా పేరున్న హోటల్స్ మూసివేస్తున్నట్లు ప్రకటించడం పర్యాటక రంగంలో నెలకొన్న సంక్షోభ తీవ్రతకు నిదర్శనమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.