మోసం చేయాలనుకోవాలే గానీ మోసగాళ్లకు లేని దారంటూ లేదు. దొరికిన ఏ మార్గాన్ని వదిలిపెట్టరు. ఇప్పుడు ప్రభుత్వ పథకాల పేరుతో జనాన్ని మోసం చేయడం ట్రెండ్ అయిపోయింది. మోసగాళ్లు కూడా ట్రెండ్ కి తగ్గట్టు అప్ డేట్ అవుతున్నారు. ‘ప్రభుత్వ ఉద్యోగం, లక్షల్లో జీతం అని టెంప్టింగ్ ఆఫర్ తో ఈ కింది లింక్ క్లిక్ చేయండి’ అంటూ నకిలీ సందేశాలు మీకు వస్తున్నాయా? అయితే జర జాగ్రత్త. కేంద్ర ప్రభుత్వ పథకం పేరిట ఒక నకిలీ సందేశం ఇప్పుడు కలకలం రేపుతోంది. “కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఆయుష్ యోజన పథకం కింద నెలకు రూ. 78,856 జీతం వచ్చే ఉద్యోగానికి ఎంపికయ్యారని, నెలకు రూ. 50 వేలు ఆదాయం వస్తుందని, దీని కోసం ఒక లింక్ ను క్లిక్ చేయండి” అనే సందేశం మీ వాట్సాప్ నంబర్ కి గాని, ఫోన్ కి గానీ సందేశం వచ్చిందా?
అయితే పొరపాటున కూడా ఈ లింక్ ను క్లిక్ చేయవద్దు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అలాంటి పథకాన్ని ఏమీ ప్రవేశపెట్టలేదు. పొరపాటున ఆ సందేశం నిజమని నమ్మి లింక్ క్లిక్ చేస్తే మీ బ్యాంకు వివరాలు, ఇతర ముఖ్యమైన డేటా మోసగాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. తద్వారా మీరు చాలా నష్టపోయే అవకాశం ఉంది. లింక్ పై క్లిక్ చేసే ముందు అది నిజమో కాదో నిర్ధారించుకోండి. ఒకవేళ అది నిజమని మీకు అనిపించినా గానీ ఆ లింక్ మీద క్లిక్ చేయకుండా, అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్ళండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఖచ్చితంగా అఫీషియల్ వెబ్ సైట్ లో దానికి సంబంధించిన సమాచారం పెడుతుంది కదా. కాబట్టి అక్కడికి వెళ్లి అప్లై చేసుకోండి.
ఈ ఒక్క విషయంలోనే కాదు, ఏ ఉద్యోగానికి సంబంధించిన సందేశం వచ్చినా దానికి సంబంధించిన కంపెనీలు తమ అఫీషియల్ వెబ్ సైట్ లో గానీ, సోషల్ మీడియాలో గానీ ఖచ్చితంగా అప్ డేట్ చేస్తాయి. ఉద్యోగాలకి సంబంధించిన మెసేజ్ లే కాదు, లాటరీలో డబ్బులు గెలుచుకున్నారని, క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని మెసేజ్ లు, ఫోన్లు వస్తుంటాయి. కాబట్టి ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండండి. లాటరీ టికెట్ కొనకుండా లాటరీలో ఎలా గెలుస్తాం అని కామన్ సెన్స్ తో ఆలోచిస్తే అస్సలు మోసపోరు. కాబట్టి మోసం చేసే వాళ్ళు ఎలాగైనా మనల్ని మోసం చేయాలని ఫిక్స్ అవుతారు. ఇలాంటి కొన్ని వందల మెసేజ్ లు మనకి పంపిస్తుంటారు. అవన్నీ కూడా నిజమో కాదో నిర్ధారించుకోవాల్సిన బాధ్యత మనదే.
A text message is being circulated with a claim that monthly monetary compensations are being provided under government approved “AYUSH Yojana” #PIBFactCheck:
▶️ This message is #Fake
▶️ Government of India is not running any such scheme. pic.twitter.com/kLibTFcNwh
— PIB Fact Check (@PIBFactCheck) September 4, 2022