Maharashtra: మహారాష్ట్ర శివసేన పార్టీ ఎంపీ రాహుల్ షెవాలే తనను మోసం చేశాడంటూ దుబాయ్ కి చెందిన మహిళ ఆరోపణలు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. పలుమార్లు అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. పెళ్లి నెపంతో తనపై అత్యాచారం చేశాడని, మానసికంగా దోపిడీకి పాల్పడుతున్నాడని సదరు మహిళ ముంబై సాకినాకా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. షెవాలే రాజకీయ పలుకుబడి కారణంగా అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తన ఫిర్యాదులో పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే సహాయం చేయాలని కోరింది.
ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని ఆమె మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేకు బహిరంగ లేఖ కూడా రాసింది. “న్యాయం కోసం నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. సాకినాకా పోలీసులు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే, నా జీవితాన్ని ముగించడం తప్ప నాకు వేరే మార్గం ఉండదు” అంటూ ఆ లేఖలో పేర్కొంది. తన భార్యతో సంబంధాలు బెడిసి కొట్టాయని, భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటానని షెవాలే తనను లోబరుచుకున్నాడని ఆమె వాపోయింది. తాను దుబాయ్ నుంచి వచ్చినప్పుడల్లా ఢిల్లీలోని ఎంపీ గెస్ట్ హౌస్ కి డిన్నర్ కి పిలిచేవాడని ఆరోపించింది. అక్టోబర్ 2021లో షెవాలే ఫోటో, వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినందుకు తనపై షార్జా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడని, ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు తనను అరెస్ట్ చేశారని ఆమె పేర్కొంది. 78 రోజులు జైలులో గడిపిన అనంతరం నిర్దోషిగా విడుదలయ్యానని ఆమె వెల్లడించింది. ముంబై వచ్చిన దుబాయ్ మహిళ, ఈ ఏడాది ఏప్రిల్ లో షెవాలేపై ఫిర్యాదు చేసింది. టెక్స్ టైల్ వ్యాపారం చేసే మహిళ కూడా తన వ్యాపారాన్ని నాశనం చేసిందని, శివసేన ఎంపీ షెవాలే తన పరువు తీశాడని ఆమె ఆరోపించింది.
ఇదిలా ఉంటే, జూలై 11న అంధేరిలోని సదరు మహిళపై మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశారు. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల మేరకు.. దోపిడీ, మోసం, పరువు నష్టం ఆరోపణలపై సాకినాకా పోలీసులు మహిళపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆమె వ్యాపారానికి ఆర్థిక సహాయం చేయాలనే సాకుతో తనను సంప్రదించిందని, అయితే చివరికి తన పరువు తీస్తానని బెదిరించి డబ్బు వసూలు చేయడం ప్రారంభించిందని.. ఎంపీ కోర్టుకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భార్యకు విడాకులు ఇచ్చి తనను పెళ్లి చేసుకోవాలని మహిళ ఒత్తిడి చేస్తోందని షెవాలే ఆరోపించారు. షెవాలే భార్య కామినీ షెవాలే కూడా మహిళ ఆరోపణలను ఖండించారు. తన భర్తపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని ఆమె స్పష్టం చేశారు. ఎంపీ రాహుల్ షెవాలే రాజకీయ, సామాజిక ప్రతిష్టను దిగజార్చేందుకు ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్ర అని ఆమె వ్యాఖ్యానించారు. ట్విట్టర్ లో తన పరువు తీసేలా వీడియో, లేఖను అప్ లోడ్ చేసినందుకు ఆ మహిళపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఎంపీ స్వయంగా ముంబై పోలీస్ సైబర్ సెల్ ను అశ్రయించినట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనతో మరోసారి మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: వీడియో: మెట్రో స్టేషన్ లో యువతి డ్యాన్స్! అధికారుల రియాక్షన్ ఏంటంటే..
ఇది కూడా చదవండి: తోపుడు బండి వ్యాపారికి ఏకే-47లతో ఇద్దరు బాడీగార్డ్స్.. ఎందుకంటే!