వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని గణతంత్ర దినోత్సం సందర్భంగా భారత అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులతో సత్కరిస్తారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 106 మందిని పద్మ అవార్డులతో సత్కరించింది. వాటిలో 6 పద్మ విభూషణ్, 9 పద్మ భూషణ్, 91 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పద్మశ్రీ అందుకున్న వారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏడుగురిని పద్మశ్రీ అవార్డు వరించింది. తెలంగాణకు చెందిన ముగ్గురికి పద్మశ్రీ అవార్డు దక్కింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా పద్మశ్రీ అవార్డులు పొందిన వారిలో ఓ డాక్టర్ అందరి దృష్టిని ఆకర్శిస్తున్నారు.
ఆయన పేరు డాక్టర్ ఎంసీ దావర్ అలియాస్ రూ.20 డాక్టర్. మధ్యప్రదేశ్ కు చెందిన ఈ 77 ఏళ్ల డాక్టర్ చాలా ప్రత్యేకమైన వారు. ఆయన్ని అందరూ రూ.20 డాక్టర్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన కేవలం రూ.20 ఫీజు మాత్రమే తీసుకుని వైద్యం చేస్తుంటారు. ఆయన 1946, జనవరి 16న పాకిస్తాన్ లోని పంజాబ్ లో జన్మించారు. దేశం విడిపోయిన తర్వాత దావర్ కుటుంబం భారత్ కు వచ్చేశారు. 1967వ సంవత్సరంలో జబల్ పూర్ లో దావర్ ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆ తర్వాత వైద్యుడిగా సేవలు అందించడం ప్రారంభించారు. ఆ సమయంలో 1971లో భారత్- పాకిస్తాన్ యుద్ధంలో దాదాపుగా ఏడాదిపాటు సేవలందించారు. 1972వ సంవత్సరం నుంచి జబల్ పూర్ లోనే వైద్యం చేయడం ప్రారంభించారు. ఆ రోజుల్లో దావర్ కేవలం రూ.2 మాత్రమే తీసుకుని వైద్యం చేసేవారంట. ఇప్పుడు ఆ ఫీజుని రూ.20కి పెంచారు.
దావర్ కు పద్మశ్రీ దక్కడంపై ఆయన కుటుంబసభ్యులు మాత్రమే కాదు.. జబల్ పూర్ వాసులు సైతం ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దావర్ మాట్లాడుతూ.. “ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకే మేము ప్రజల వద్ద ఫీజులు వసూలు చేయడం లేదు. ఓపిగ్గా పనిచేస్తే విజయం తప్పకుండా దక్కుతుంది. మీ కష్టానికి గౌరవం కూడా లభిస్తుంది. ఆలస్యం అయినా కూడా కొన్నిసార్లు విజయం వరిస్తుంది. దాని ఫలితంగానే నేను ఈ అవార్డును అందుకున్నాను.” అంటూ డాక్టర్ దావర్ వ్యాఖ్యానించారు. దావర్ కు పద్మశ్రీ దక్కడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు సంబరాలు చేసుకున్నారు.
దావర్ కు అవార్డు దక్కడంపై ఆయన కుమారుడు కూడా స్పందించారు. “నాన్న గారికి పద్మశ్రీ అవార్డు దక్కడం ఎంతో సంతోషంగా ఉంది. ఇంతకాలం రాజకీయ పరపతి ఉన్నవాళ్లకే అవార్డులు దక్కుతాయని భావించే వాడిని. ప్రభుత్వం మాలాంటి వారిని గుర్తించడం ఆనందంగా అనిపించింది. నాన్నగారి లాంటి వారిని గుర్తించి పద్మశ్రీ అవార్డుతో సత్కరిస్తున్న తీరు ఎంతో గొప్ప విషయం” అంటూ కామెంట్ చేశారు. “మామయ్య గారికి అవార్డు మాకు, మా కుటుంబానికి మాత్రమే కాదు.. ఈ నగరానికి కూడా గర్వకారణం” అంటూ దావర్ కోడలు వ్యాఖ్యానించారు. రూ.20 డాక్టర్ కు పద్మశ్రీ దక్కడంపై జబల్ పూర్ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సేవలను కొనియాడుతున్నారు.