ఢిల్లీ లిక్కర్ స్కాం తెలియని వారు ఉండరు. ప్రస్తుతం ఢిల్లీ నుంచి తెలంగాణ వరకూ రాజకీయ నేతలను కుదిపేస్తున్న అంశం. దేశంలో రాజకీయ నాయకులను, పారిశ్రామిక వేత్తలను కంటి మీద కునుకు లేకుండా చేసింది. అలాంటి లిక్కర్ స్కాంను తెర మీదకు తీసుకొచ్చిన వ్యక్తి ఒకడున్నాడు. అతనొక్కడే ఈ లిక్కర్ స్కాంకి ఆద్యం పోసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రస్తుతం దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీలో మొదలై ఇప్పుడు తెలంగాణలో సంచలనం సృష్టిస్తోంది. ఈ స్కాంలో పెద్ద పెద్ద వ్యక్తులే ఇన్వాల్వ్ అయి ఉన్నట్లు ఇప్పటికే ఈడీ వెల్లడించింది. అటు ఢిల్లీ నుంచి తెలంగాణ వరకూ లిక్కర్ స్కాంలో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఇరుక్కున్నట్లు మనం చూస్తున్నాం. తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవితపై లిక్కర్ స్కాం కేసుకి సంబంధించి ఆరోపణలు రావడం, ఆమె ఈడీ విచారణకు హాజరు కావడం ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఏ సమయంలో అయినా కవిత అరెస్టు ఉండవచ్చునన్న ఊహాగానాలు వస్తున్నాయి. అసలు ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం ఎలా బయటకు వచ్చింది? ఈరోజు ఇంత రచ్చ జరగడానికి కారణం ఎవరు? ఈ స్కాం బయటపడడానికి ఆద్యం పోసింది ఎవరు? అన్నది ఆసక్తికరంగా మారింది.
దేశ రాజధాని ఢిల్లీలో మొదట్లో మద్యం దుకాణాలు ప్రభుత్వ అధీనంలో ఉండేవి. అయితే 2020 సెప్టెంబర్ లో మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ ఆప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మేరకు 2021 జనవరి 5న మద్యం పాలసీ రూపకల్పనకు ఢిల్లీ ప్రభుత్వం మంత్రుల బృందంతో కమిటీ వేసింది. ఈ బృందంలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, కైలాష్ గెహ్లాట్ ఉన్నారు. వీరంతా కలిసి 2 నెలల తర్వాత కొత్త లిక్కర్ పాలసీని ఆమోదించారు. అయితే ఆప్ ప్రభుత్వం మే 21 2021న ఎలాంటి సవరణలు లేకుండానే ఈ కొత్త లిక్కర్ పాలసీని ఆమోదించింది. అదే వారి కొంప ముంచింది. ఈ కొత్త లిక్కర్ పాలసీలో విదేశీ మద్యం ధరలపై ఆప్ ప్రభుత్వ నిర్ణయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా వ్యతిరేకించారు. అయినా అవేమీ పట్టించుకోకుండా ఆప్ ప్రభుత్వం ఆ కొత్త లిక్కర్ పాలసీని ఆమోదించింది. దీనిపై వినయ్ కుమార్ పలు ఆరోపణలు చేశారు.
కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లిక్కర్ పాలసీలో అవకతవకలు ఉన్నట్లు 2021 జూలై 20న కేంద్ర హోం శాఖకు వినయ్ కుమార్ సక్సేనా లేఖ రాశారు. ఆ లేఖను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం సీబీఐని దర్యాప్తునకు ఆదేశించింది. అప్పటి నుంచి మొదలైంది అసలు కథ. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు. ఆగస్టు 19న 15 మంది పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చింది. పలు చోట్ల సోదాలు కూడా నిర్వహించింది. ఈ వ్యవహారం జరుగుతుండగానే భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు రావడంలో 3 రోజుల తర్వాత ఈడీ కూడా రంగంలోకి దిగింది. లిక్కర్ పాలసీ వ్యవహారంలో పెద్ద స్కాం జరిగిందని విచారణ చేయడం మొదలుపెట్టింది. అలా పలువురు రాజకీయ, పారిశ్రామిక వేత్తలపై ఈడీ దాడులు నిర్వహించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి మూలాలు హైదరాబాద్ లోనే ఉన్నట్లు సీబీఐ, ఈడీ వెల్లడించింది.
హైదరాబాద్ కేంద్రంగానే లిక్కర్ స్కాం జరిగిందని నిందితులు రిమాండ్ రిపోర్టుల్లో పలుమార్లు పేర్కొనడం గమనార్హం. ఈ స్కాంలో మొత్తం 11 మందిని అరెస్ట్ చేశారు. ఈ స్కాంలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ అరెస్ట్ కూడా చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం, విచారణకు ఆమె హాజరు కావడం పెద్ద రచ్చకు దారి తీసింది. కవిత తరపున అరుణ్ పిళ్ళై వ్యాపారం చేసినట్లు.. సౌత్ గ్రూప్ నుంచి రూ. 100 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు ఈడీ ఆరోపించింది. ప్రస్తుతం కవిత విచారణ ఎదుర్కుంటున్నారు. విచారణ తర్వాత కవిత అరెస్ట్ ఖాయమన్న ఊహాగానాలు వస్తున్నాయి. ఒకవేళ అరెస్ట్ అయితే పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. అయితే ఒక వ్యక్తి లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా చేసిన ఆరోపణ ఇంత రచ్చకు తెర లేపింది. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.