ఆన్ లైన్ విద్య యాప్ బైజూస్ యజమాని రవీంద్రన్ పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. యూపీఎస్సీ కోర్సు కోచింగ్ లో తప్పుడు సిలబస్ ను పెట్టారన్న ఫిర్యాదుపై ఐటీ చట్టంలోని నేరపూరిత కుట్ర కింద క్రిమినల్ కేసును నమోదు చేశారు. క్రిమోఫోబియా సంస్థ చేసిన ఫిర్యాదు ఆధారంగా నేరపూరిత కుట్ర, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69 (ఎ) కింద రవీంద్రన్ పై కేసు నమోదు చేశామని ముంబై పోలీసులు పేర్కొన్నారు.
బైజూస్ కంపెనీ యూపీఎస్సీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని అందించిందని క్రిమియోఫోబియా వ్యవస్థాపకుడు స్నేహిల్ ధాల్ ఆరోపించారు. యుపీఎస్సీ ప్రిపరేటరీ మెటీరియల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)ను ‘యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ట్రాన్స్నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్’ కి నోడల్ ఏజెన్సీగా పేర్కొన్నట్లు తెలిపారు.
ఎఫ్ఐఆర్ కాపీని తమ న్యాయవాదులు పరిశీలిస్తున్నారని బైజూస్ రవీంద్రన్ వెల్లడించారు. అలాగే క్రిమియోఫోబియా లేఖను కూడా ధృవీకరించిన సంస్థ తాము అందించిన మెటీరియల్ వాస్తవంగా సరైనదని భావిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి హో మంత్రిత్వ శాఖ జారీ చేసిన అధికారిక కాపీని క్రిమియోఫోబియాకు షేర్ చేసినట్లు తెలిపారు.