పోలీసులు అంటే శాంతి భద్రతల పరిరక్షణ కోసం ముందుండి పోరాడే యోధులు. తమ కుటుంబాన్ని, ప్రాణాలను లెక్కచేయకుండా డ్యూటీ చేస్తుంటారు. పోలీసు ఉద్యోగాన్ని ఎంచుకున్నారు అంటేనే మీ కుటుంబాన్ని రిస్క్ లో పెట్టినట్లే అని చెబుతుంటారు. నిజంగా అది నిజమని ఓ ఘటనలో నిరూపితమైంది. లీవ్ కావాలని రిక్వెస్ట్ చేస్తే అధికారులు అతని పిరిస్థితిని సీరియస్ గా తీసుకోలేదు. వారి నిర్లక్ష్యం ఇప్పుడు ఆ కానిస్టేబుల్ జీవితంలో తీరని విషాదాన్ని నింపింది. ఆ బాధను తట్టుకోలేని అతను ఎస్ఎస్పీ కార్యాలయం ముందు నిరసనకు దిగాడు.
వివరాల్లోకి వెళ్తే.. సోనూ చౌదరి స్వస్థలం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మథుర. అతను బైద్ పుర్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి భార్య రెండేళ్ల కుమారుడు ఉన్నారు. తన భార్యకు డిసెంబర్ లో ఆపరేషన్ జరగడంతో పిల్లాడిని చూసుకోవడం కష్టంగా మారింది. అదే విషయాన్ని వివరిస్తూ తనకు సెలవు కావాలని ఎస్ఎస్పీ(సీనియర్ సూపరింటెండ్ ఆఫ్ పోలీస్) కార్యాలయానికి లీవ్ రిక్వెస్ట్ పంపాడు. అది పరిశీలించిన అధికారులు అతని పరిస్థితిని లైట్ తీసుకున్నారు. డ్యూటీకి హాజరు కావాలంటూ ఆదేశించారు.
చేసేది లేక సోనూ చౌదరి ఎప్పటిలాగానే డ్యూటీకి వచ్చాడు. అతను డ్యూటీకి వచ్చిన తర్వాత తన ఇంట్లో ఘోరం జరిగింది. ఆపరేషన్ చేయించుకున్న భార్య పడుకుని ఉంది. తన రెండేళ్ల కుమారుడు ఆడుకుంటూ బయటకు వెళ్లాడు. వెళ్లిన పిల్లాడు ఎంతకీ తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. చివరికి ఆ పిల్లాడు వాళ్ల ఇంటి వద్ద నీటి కుటంలో పడి కనిపించాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆ చిన్నారి మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
బాధతో సోనూ చౌదరి గుండెలు పగిలేలా ఏడ్చాడు. అధికారులు లీవ్ ఇవ్వకపోవడం వల్లే ఇలా జరిగిందని భావించిన సోనూ.. కుమారుడి మృతదేహంలో ఎస్ఎస్పీ కార్యాలయానికి వెళ్లాడు. వాళ్లు లీవ్ ఇవ్వకపోవడం వల్ల ఎంత ఘోరం జరిగిందో అక్కడున్న వారికి అర్థమయ్యేలా చూపించాడు. అక్కడున్న పోలీసులు, కానిస్టేబుళ్లు సోనూ చౌదరిని ఓదార్చి పంపేశారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు సోనూ చౌదరి పరిస్థితి చూసి కన్నీరు మున్నీరవుతున్నారు.