సాధారణంగా అధికారులు తమ కింది ఉద్యోగులు విధులు సంక్రమంగా నిర్వర్తించకపోతే ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ఆ తర్వాత కూడా మళ్లీ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే నోటీసులు జారీ చేస్తారు. కానీ ఓ కలెక్టర్ తన పరిధిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కాలేదని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన కొందరు కింది స్థాయి ఉద్యోగులపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ జిల్లా కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ ప్రభుత్వ ఉద్యోగులపై మండిపడ్డాడు. వ్యాక్సినేషన్ లక్ష్యాలను చేరుకోవడంలో ఉద్యోగులు విఫలమయ్యారంటూ వారి పై ఆగ్రహం వ్యక్తంచేశాడు. గ్వాలియార్ జిల్లాలోని భితర్వార్ రెవెన్యూ కార్యాలయంలో వ్యాక్సినేషన్ కు సంబంధించి సమావేశంలో పాల్గొన్న కలెక్టర్.. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఒక్కరోజు ఆలస్యమైన సహించేది లేదని, అలా చేస్తే మిమ్మల్ని ఉరి తీస్తానంటూ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి.
“జిల్లాలోని ప్రజలంతా టీకాలు వేయించుకునేలా తగు చర్యలు తీసుకోవాలి. పూర్తి స్థాయిలో టీకాలు ప్రక్రియ జరిగేందుకు ప్రజల ఇంటి వద్దకు వెళ్లి ప్రార్థించండి. పొలాల వద్దకు వెళ్లి వారికి సాష్టాంగా నమష్కారం చేసి టీకా వేయించుకోమని వేడుకోండి” అంటూ కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ హెచ్చరించారు. ఎట్టిపరిస్థిలోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ ఉద్యోగులను ఆదేశించారు. ప్రస్తుతం ఈ కలెక్టర్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయమై రిపోర్టర్లు కలెక్టర్ ని ప్రశ్నించగా.. ‘వ్యాక్సినేషన్ పక్రియా పూర్తి చేయాలని, లేకుంటే సస్పెండ్ చేస్తానని, చర్యలు తీసుకుంటానని మాత్రమే హెచ్చరించినట్లు’ ఆయన తెలిపారు. ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.