గ్యాస్ సబ్సిడీకి సబంధించి కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. గృహ వినియోగానికి ఇస్తున్న గ్యాస్ సబ్సిడీని కేంద్రం ఎత్తివేసిన సంగతి తెలిసిందే. 2019-20 ఏడాదిలో గ్యాస్ సబ్సిడీ కింద రూ.24,172 కోట్లు విడుదల చేయగా.. 2021-22 నాటికి దానిని రూ.242 కోట్లకు తగ్గించారు. గ్యాస్ సబ్సిడీకి సంబంధించి కేంద్ర సహాయ మంత్రి సోమవారం రాజ్యసభలో సమాధానం ఇచ్చారు.
2019 ఏప్రిల్లో గ్యాస్ సిలిండర్ ధర రూ.706.50 ఉంగడా అది ఆదివారానికి రూ.1,053కి చేరినట్లు తెలిపారు. అంటే గ్యాస్ సిలిండర్ ధర 2019 నుంచి ఇప్పటికి 49 శాతం మేర పెరిగింది. అలాగే గ్యాస్ సిలిండర్ ఆధారమైన సౌధీ కాంట్రాక్ట్ ప్రైస్ కూడా అప్పటికీ ఇప్పటికీ 47శాతం(508 డాలర్ల నుంచి 750 డాలర్లకు చేరింది) పెరిగినట్లు తెలిపారు.
ఇప్పటికీ చాలా మందికి సబ్సిడీ మీద క్లారిటీ లేదు. ఎల్పీజీ సిలిండర్పై గృహోపకరణాల అవసరాలకు అందిస్తున్న గ్యాస్ సబ్సిడీని కేంద్రం తొలగించింది. కేవలం పీఎం ఉజ్వస యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొందిన వారికి మాత్రమే గ్యాస్ సబ్సిడీని అందజేస్తున్నారు. కరోనా ప్రారంభం అయిన దగ్గర నుంచి పీఎం ఉజ్యల యోజన పథకం లబ్ధిదారులకు తప్ప ఎవరికీ గ్యాస్ సబ్సిడీ ఇవ్వలేదని స్పష్టం చేశారు.
పీఎం ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్న లబ్ధిదారులకు కేంద్రం రూ.200 చొప్పున గ్యాస్ సబ్సిడీ ఇస్తుంది. ఏడాదిలో 12 సిలిండర్లకు ఈ సబ్సిడీ లభిస్తుంది. మిగిలిన వారు గృహ అవసరాలకు కావాల్సిన గ్యాస్ సిలిండర్ ను మార్కెట్ రేటుకే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా 30 కోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో కేవలం 9 కోట్లు మాత్రమే పీఎం ఉజ్వల పథకం కింది తీసుకున్న కనెక్షన్లు. అంటే మిగిలిన 21 కోట్ల మందికి గ్యాస్ సబ్సిడీ రాదు. గ్యాస్ సబ్సిడీ ఎత్తివేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలుసుకోండి.