ఎడ్యుకేషన్ లోన్ కావాలా..? బిజినెస్ కావాలా..? లేదా వ్యవసాయ లోన్ కావాలా..? ఏ లోన్ కావాలన్నా ఒకే వేదిక.. ఒకే పోర్టల్. కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన 'జన్ సామర్థ్' పోర్టల్ ద్వారా 12 ప్రభుత్వ పథకాల కింద రుణాలు పొందవచ్చు.
ప్రజలారా మీకో ముఖ్య గమనిక. ఇన్నాళ్లు లోన్ కావాలని బ్యాంకుల చుట్టూ తిరిగి అలిసిపోయారా..? ఇకపై ఆ భాధలు అక్కర్లేదు. అన్ని రకాల లోన్లకు, ప్రభుత్వ పథకాల నుంచి లభ్ది పొందటానికి కేంద్ర ప్రభుత్వం ఒకే వేదికను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో 12 ప్రభుత్వ పథకాల కింద రుణాలు తీసుకోవచ్చు. అందుకోసం ఈ పోర్టల్ నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోర్టల్ ఎందుకు తీసుకొచ్చారు..? ప్రయోజనాలేంటి..? ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? ఏయే లోన్లకు అప్లై చేసుకోవచ్చు..? ఎన్ని రోజుల్లో లోన్ మంజూరు చేస్తారు..? అర్హత ఉన్న లోన్ మంజూరు చేయకపోతే ఎవరకి పిర్యాదు చేయాలి..? వంటి మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
కేంద్ర ప్రభుత్వం అందించే అన్ని స్కీమ్లను ఒకే ప్లాట్పామ్పై అందించాలనే ఉద్దేశ్యంతో ‘జన్ సమర్థ్‘ పోర్టల్ను తీసుకొచ్చారు. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ప్రజలకు తేలిగ్గా అందించవచ్చని భావిస్తోంది. ఈ పోర్టల్ పైలట్ ట్రయల్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 4 కేటగిరీల రుణాలకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. వీటిలో విద్య, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, వ్యాపారం, జీవన రుణాలు వంటివి అందుబాటులో ఉన్నాయి. రానున్న రోజుల్లో ఆయా రాష్ట్రాలు అందించే ప్రభుత్వ పథకాలు కూడా ఈ పోర్టల్ కు అనుసంధానం చేయనున్నారు.
మొదటగా మీకు ఏ రకమైన లోన్ అవసరం ఉందొ నిర్ధారించుకోవాలి. అనంతరం లోన్ కేటగిరీ ఎంచుకొని.. మీకు సంబంధిత లోన్ పొందడానికి అర్హత ఉందో లేదో తెలుసుకోవాలి. అందుకోసం.. మీ కుటుంబ వార్షిక ఆదాయం ఎంత? మీ రిజర్వేషన్ ఏమైనా ఉందా..? లోన్ ఎంతకావాలి? వంటి కొన్ని సాధారణ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మీ అర్హతను తనిఖీ చేసి.. మీరు ఏదైనా పథకానికి అర్హులైతే, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తుంది. రుణ దరఖాస్తు నుంచి దాని ఆమోదం వరకు, అన్నీ ‘జన్ సమర్థ్’ పోర్టల్ ద్వారానే జరుగుతాయి. దరఖాస్తుదారులు పోర్టల్లో తమ రుణ స్థితిని కూడా తనిఖీ చేయగలుగుతారు. దరఖాస్తుదారులు రుణం పొందకపోతే ఆన్లైన్లో ఫిర్యాదు కూడా చేయవచ్చు. దరఖాస్తుదారు ఫిర్యాదును మూడు రోజుల్లో పరిష్కరించాలి. ప్రస్తుతం, అర్హత ఉన్న దరఖాస్తు దారులకు లోన్ మంజూరు చేయడానికి ప్రభుత్వ బ్యాంకులతో సహా 125 కంటే ఎక్కువ ఆర్థిక సంస్థలు ఈ పోర్టల్కు అనుసంధానించినట్లు సమాచారం.
ఉదాహరణకు.. మీకు ఎడ్యుకేషన్ లోన్ కావాలనుకోండి. ఇందులో రెండు రకాల లోన్లు అందుబాటులో ఉన్నాయి. స్వదేశంలో చదవాలనుకుంటే.. కేంద్ర ప్రభుత్వ వడ్డీ రాయితీ పథకం కింద లోన్ మంజూరు చేస్తారు. అదే విదేశాల్లో విద్యనభ్యసించాలనుకుంటే.. డా. అంబేద్కర్ సెంట్రల్ సెక్టార్ స్కీం కింద లోన్ మంజూరు చేస్తారు.
మీరు బీసీ క్యాటగిరీకి చెందిన విద్యార్థి, మీ కుటుంబ వార్షిక ఆదాయం రూ. 4.50 లక్షలలోపు అనుకోండి. స్వదేశంలో రెండేళ్ల పాటు ఏదేని కోర్స్ చేయడం కోసం రూ. 2 లక్షలు ఎడ్యుకేషన్ కావాలి. ఈ మొత్తంలో మీరు ఎంత చెల్లించగలరన్నది ఎంటర్ చేయాలి. అందులో ఓ రూ. 50 వేలు చెల్లించగలరు అనుకుందాం.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ వడ్డీ రాయితీ (CSIS) పథకం కింద గరిష్టంగా రూ. 1,50,000 రుణ మొత్తానికి అనుమతి ఉంటుంది. ఈ మొత్తాన్ని 20 ఏళ్ల పాటు నెలకు రూ.1,300 చొప్పున చెల్లించవచ్చు. అలాగే, రాయితీ కింద రూ. 38,250 మొత్తానికి సబ్సిడీ కింద రాయితీ పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వ వడ్డీ రాయితీ పథకం కింద.. గ్రాడ్యుయేషన్/ పోస్ట్ గ్రాడ్యుయేషన్/ డాక్టరేట్ మరియు ఇతర కోర్సులకు రుణాలు మంజూరు చేస్తారు.
పైన పేర్కొన్న అర్హతలతో ఒక విద్యార్థికి విదేశాల్లో చదడానికి రూ. 10 లక్షల రుణం కావాలి. అందులో మీరు ఎంత మొత్తం చెల్లించగలరన్నది ఎంటర్ చేయాలి. ఓ రూ. 4 లక్షలు చెల్లించగలరు అనుకుందాం.. ఇప్పుడు డా. అంబేద్కర్ సెంట్రల్ సెక్టార్ స్కీం కింద గరిష్టంగా రూ. 6,00,000 రుణ మొత్తానికి అనుమతి ఉంటుంది. ఈ మొత్తాన్ని 20 ఏళ్ల పాటు నెలకు రూ.5,210 చొప్పున చెల్లించవచ్చు. అలాగే, రాయితీ కింద రూ. 1, 53,000 మొత్తానికి సబ్సిడీ కింద రాయితీ పొందవచ్చు. డా. అంబేద్కర్ పథకం కింద.. మాస్టర్స్/ ఎంఫిల్/ డాక్టరేట్ వంటి పైచదువులకు రుణాలు మంజూరు చేస్తారు.
ఈ విధంగానే వ్యవసాయ మౌలిక సదుపాయాలు, వ్యాపారం, జీవన రుణాలు వంటి అవసరాలకు వారి వారి అర్హతలను బట్టి రుణాలు మంజూరు చేస్తారు. మీకు ఏదేని లోన్ కావాలన్నా, ఈ సమాచారం గురుంచి సందేహాలున్నా.. అధికారిక వెబ్ సైట్ JanSamarthని సందర్శించండి.అలాగే, ఈ వివరాలను మీకు తెలిసిన మరో నలుగురికి తెలియజేయండి. ఈ వార్తపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయగలరు.