గులాబ్ తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్తోపాటు తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్గడ్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఈ తుఫాన్ వల్ల ఆస్తి నష్టమే కాకుండా పలు చోట్ల ప్రాణ నష్టం కూడా వాటిల్లింది. ఇప్పటికీ కొన్ని చోట్ల ఇండ్ల నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వాలు ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నాయి.
తాజాగా మహారాష్ట్రలో ఓ చోట ప్రయాణికులు ఉన్న బస్సు నదిలో కొట్టుకుపోయింది. యావత్మాల్ జిల్లాలో వరదలో బస్సు కొట్టుకుపోయింది.. దాహగాం పుల్మారాలో వంతెనపై నుంచి వదర నీరు ఉధృతంగా ప్రవహిస్తుండగా.. మహారాష్ట్ర ఎస్టీ బస్ను అలాగే పోనించాడు డ్రైవర్. అక్కడ ఉన్న కొంత మంది యువకులు హెచ్చిరిస్తూ ఉండగా బస్ అలాగే ముందుకు పోయింది. అందరూ చూస్తుండగానే బస్సు నదిలో కొట్టుకుపోవడంతో అందరూ షాక్ కి గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో.. డ్రైవర్, కండక్టర్ సహా ఆరుగురు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఉమర్ఖేడ్ నుండి పుసాద్ దహాగావ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. దహాగావ్ వంతెనపై ప్రమాదానికి గురైంది.. ఇది నాగపూర్ డిపోకు చెందిన బస్సుగా చెబుతున్నారు. కాగా, ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో నలుగురు వరదలో మిస్ అయినట్టు అధికారులు వెల్లడించారు. ఆ సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మహారాష్ట్రలో రానున్న 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ముంబైలోని రీజినల్ మిటరలాజికల్ సెంటర్ వెల్లడించింది.