సాధారణంగా బస్సుల్లో పిక్ పాకెట్ చేసే దొంగలు ఉంటారు. మహిళల మెడలపై ఉన్న బంగారు వస్తువులు దొంగతనం చేస్తుంటారు. కానీ.. ఓ దొంగ మాత్రం చిన్న చిన్న ఐటమ్స్ చోరీ చేస్తే ఏం వస్తుందీ అని భావించాడో ఏమో కానీ.. ఏకంగా ఆర్టీసీ బస్సునే దొంగతనం చేశాడు. కాకపోతే ఇతగాడి కర్మ కాలి బస్సును దొంగిలించిన కొన్ని గంటల్లోనే పోలీసులకు పట్టుబడ్డాడు. కేరళాలోని ఆలువా ఆర్టీసీ బస్ డిపోలో బస్సును పార్క్ చేసి ఉంచారు. ఆ సమయంలో అక్కడ ఆర్టీసీ సిబ్బంది లేకపోవడం గమనించి అనీష్ అనే దొంగ మెల్లిగా బస్సులోకి దూరి స్టార్ట్ చేసి వేగంగా పోనిచ్చాడు.
ఎవరూ లేరని భావించిన దొంగ బస్సును వేగంగా బయటకు తీయడం అక్కడ ఉన్న డిపో సెక్యూరిటీకి అనుమానం వచ్చింది. వెంటనే పై అధికారులకు విషయం గురించి చెప్పడంతో అలర్ట్ అయ్యారు. అనీష్ టాప్ గేర్ వేసి బస్సును మెయిన్ రోడ్డుపైకి తీసుకు వెళ్లాడు. బయట ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో బస్సును వేగంగా నడపలేకపోయాడు. అప్పటికే రంగంలోకి దిగిన పోలీసులు ఆ బస్సును చేజ్ చేసి పట్టుకున్నారు. బస్సును దొంగిలించాలని ప్రయత్నించిన అనీష్ ప్లాన్ బెడిసి కొట్టడంతో ఇప్పుడు జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు.
బస్సు చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆర్టీసీ బస్సు ఎక్కి.. టికెట్ తీసుకొని ప్రయాణించాలి కానీ.. బస్సును కొట్టేసి కాదురా బాబూ అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.