వేసవి కాలంలో మండుటెండల్లో డ్రైవింగ్ చేసేవారు ఎండ వలన వడగాల్పుల వలన అనారోగ్యం భారిన పడుతున్నారు. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న ఆ నిర్ణయంతో డ్రైవింగ్ చేసేవారికి ఉపశమనం లభించనుంది.
జీవనోపాధికోసం కొంతమంది డ్రైవింగ్ వృత్తిని ఎంచుకుంటారు. బస్సులు, లారీలు, కార్లు, ట్రక్కులల్లో డ్రైవర్లుగా చేరి ఉపాధి పొందుతుంటారు. వ్యాపార, వాణిజ్యంలో భాగంగా వస్తువులను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలిస్తుంటారు. ఈ తరలింపు ఎక్కువగా లారీలు, ట్రక్కుల ద్వారా జరుగుతూ ఉంటుంది. లారీ డ్రైవర్లు, ట్రక్కు డ్రైవర్లు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి గంటలు గంటలు ప్రయాణిస్తుంటారు.
వారి సౌకర్యార్థం ట్రక్కుల్లో, లారీల్లో డ్రైవర్ క్యాబిన్ లను వినూత్నమైన మార్పులు చేయాలని ఆటో మొబైల్ సంస్థలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించారు. 2025 నుంచి తయారు చేసే ట్రక్కులు, లారీల్లోని డ్రైవర్ క్యాబిన్ లలో ఎసి అందుబాటులో ఉండేలా రూపొందించాలని కంపెనీలను నితిన్ గడ్కరీ ఆదేశించారు. దీనికోసం 18నెలల సమయం ఇస్తున్నట్లుగా చెప్పారు. ప్రస్తుతం ఉన్న వాహనాల్లో కూడా ఎసి క్యాబిన్ లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఇప్పటికే విదేశాల్లోని లారీల్లో ఎసి తో కూడిన క్యాబిన్ లు ఉన్నాయని తెలిపారు. మనదేశంలో మాత్రం ఇప్పటి వరకు అటువంటి వెసులుబాటు లేదని, ఇకపై లారీల్లోని క్యాబిన్ లలో ఎసిలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో డ్రైవర్లు సౌకర్యవంతంగా డ్రైవింగ్ చేయలేరని, కాబట్టి క్యాబిన్ లలో ఎసిలు ఏర్పాటు చేసుకున్నట్లైతే వారు సౌకర్యవంతంగా వాహనాలను నడుపుతారని వెల్లడించారు. దీని కోసం భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని రూ. 10వేల నుంచి రూ. 20వేల వరకు వెచ్చించి డ్రైవర్ క్యాబిన్ లలో ఎసిలు అమర్చుకోవచ్చని కేంద్ర రోడ్డు రవాణా శాఖ తెలిపింది. ఇక ఈ నిర్ణయంతో డ్రైవర్లకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభించనుంది.