ప్రమాదం ఏవైపునుంచి ముంచుకొస్తుందో తెలియదు. ఆకస్మాత్తుగా చోటుచేసుకునే ప్రమాదాలు తీరని శోకాన్ని మిగుల్చుతాయి. నిత్యం ఏదో ఓ చోట రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటూ అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తుంటాయి.
వాహనాలను నడిపే డ్రైవర్లు మధ్యం మత్తులో లేదా నిర్లక్ష్యంగా, పరిమితికి మించిన వేగంతో వాహనాలను నడపడంతో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. వారి నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటూ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ వారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి, నియమ నిబంధనలు కఠినతరం చేసినప్పటికి వాటిని ఉల్లంఘిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు కొందరు వాహనదారులు. తాజాగా ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా, ఆరుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే..
ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలో శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో తిరుపతి నుంచి కడప వెళ్తున్న ఆర్టీసీ బస్సును పుల్లంపేట సమీపంలో జాతీయ రహదారిపై ఎదురుగా వేగంగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ప్రమాద స్థలంలో భయానక వాతావరణం నెలకొంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.