ఈ రోజు తెల్లవారుజామున సర్ఖేజ్-గాంధీనగర్ జాతీయ రహదారిపై రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. ఓ కారు అతి వేగంగా వచ్చి జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా మరో 10 మందికి గాయాలయ్యాయి.
ఈ మధ్యకాలంలో అనేక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాలకు ముఖ్య కారణాలు అతివేగం, నిర్లక్ష్యం. వీటి కారణంగా చాలామంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఎదుటివారి నిర్లక్ష్యం వల్ల, రాష్ డ్రైవింగ్ వల్ల ఇతరుల ప్రాణాలను బలితీసుకుంటున్నారు. తాజాగా గుజరాత్ లోని అహ్మదాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున సర్ఖేజ్-గాంధీనగర్ జాతీయ రహదారిపై రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. ఓ కారు అతి వేగంగా వచ్చి జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా మరో 10 మందికి గాయాలయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
సర్ఖేజ్-గాంధీనగర్ జాతీయ రహదారిపై ఇస్కాన్ బ్రిడ్జి దగ్గర తెల్లవారుజామున థార్(SUV) ట్రక్కును ఢీకొంది. స్థానికులు సమాచారం చేరవేయడంతో స్థానిక ట్రాఫిక్ పోలీసులు, హోంగార్డు జవాన్ అక్కడికి చేరుకున్నారు. చాలామంది అక్కడ గుంపుగా చేరగా.. అదే సమయంలో జాగ్వార్ కారు వేగంగా వచ్చి జనాలపైకి దూసుకెళ్లింది. స్పాట్లోనే ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురు చికిత్స పొందుతూ మరణించారు. చనిపోయిన వారిలో ఓ కానిస్టేబుల్, ఓ జవాన్ కూడా ఉన్నారు. గాయపడిన 10 మందిని ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాద వార్త విన్న గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ రోడ్డు ప్రమాదం చాలా బాధాకరమని ట్వీట్ చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షల చొప్పున, గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.