చట్టాలు ఎవ్వరికీ చుట్టం కాదూ అని ఇటీవల తీర్పులు చూస్తే అర్థమౌతుంది. సెలబ్రిటీలు సైతం చట్టం ముందు తలవంచక తప్పదు. మోదీ ఇంటి పేరున్న వారంతా దొంగలే అన్నందుకు రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధించింది.
చట్టాలు ఎవ్వరికీ చుట్టం కాదూ అని ఇటీవల తీర్పులు చూస్తే అర్థమౌతుంది. తప్పు చేస్తే సెలబ్రిటీలు సైతం చట్టం ముందు తలవంచక తప్పదని నిరూపితమౌతోంది. మోదీ ఇంటి పేరున్న వారంతా దొంగలే అన్నందుకు పరువు నష్టం కింద రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధించింది సూరత్ కోర్టు. దీంతో ఆయన లోక్ సభ సభ్యత్వంపై పార్లమెంట్ సస్పెన్షన్ విధించింది. అంతలో సుప్రీంకోర్టు సూరత్ కోర్టు తీర్పుపై స్టే విధించడంతో.. రాహుల్ సస్పెన్షన్ ఎత్తివేసింది. అలాగే చిరంజీవి బ్లడ్ బ్యాంకులో అవకతవకలు జరిగాయంటూ ప్రముఖ నటులు జీవిత, రాజశేఖర్ దంపతులు చేసిన ఆరోపణలపై విచారించిన కోర్టు.. అవి అవాస్తవాలను పేర్కొంటూ.. వీరిద్దరికి ఏడాది పాటు జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రముఖ నటి ఒకరికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది.
సినిమా థియేటర్లలోని కార్మికులను మోసం చేసినందుకు ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదకు చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు 6 నెలల జైలు శిక్షను విధించింది. ఆమెతో పాటు మరో ముగ్గురికి ఈ శిక్ష ఖరారు చేసింది. రూ. 5000 చొప్పున ఒక్కొక్కరికి జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే.. అలనాటి నటి జయప్రదకు చెన్నైలోని రాయపేటలో గతంలో ఓ సినిమా థియేటర్ ఉంది. చెన్నై నివాసితులైన రామ్ కుమార్, రాజబాబుతో కలిసి అన్నా రోడ్డులో సినిమా థియేటర్ను నడిపారు. తొలుత బాగా లాభాలు వచ్చినప్పటికీ తర్వాత రాబడి తగ్గడంతో పాటు థియేటర్ మూసివేసింది. అయితే థియేటర్ నడిపే సమయంలో కార్మికుల నుండి ఈఎస్ఐ రూపంలో కొంత డబ్బులు వసూలు చేసింది థియేటర్ యాజమాన్యం.
అయితే థియేటర్ మూసివేయడంతో తిరిగి డబ్బులు చెల్లించాల్సి ఉండగా.. వాటిని కార్మికులకు అందజేయలేదు. దీంతో వీరు చెన్నైలోని కార్మిక బీమా కార్పొరేషన్ను ఆశ్రయించారు. సదరు బీమా సంస్థ చెన్నై ఎగ్మోర్ కోర్టును ఆశ్రయించింది. థియేటర్ యాజమాన్యానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసింది. కార్మికుల నుండి వసూలు చేసిన ఈఎస్ఐ డబ్బులను తిరిగి వారికి చెల్లించలేదని కోర్టులో పేర్కొంది. దీన్ని వ్యతిరేకిస్తూ మద్రాసు హైకోర్టులో జయప్రద తదితరులు దాఖలు చేసిన మూడు పిటిషన్లు కొట్టివేసింది. అయితే ఆమె వాటిని కార్మికులకు తిరిగి అందిస్తామని చెప్పినప్పటికీ కోర్టు అంగీకరించలేదు. ఇరుపక్షాల వాదనలు విన్న ఎగ్మోర్ న్యాయస్థానం జయప్రద సహా ముగ్గురికి ఆరు నెలల జైలుశిక్ష, 5 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.