బిజినెస్ డెస్క్- ఈ కరోనా సమయంలో సామాన్యులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఆంతా ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు. కరోనా సోకిన వారు ఆస్పత్రుల బిల్లులు కట్టలేక బెంబేలెత్తిపోతున్నారు. కొందరైతే కరోనా చికిత్సకు ఆస్తులను అమ్ముకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇటువంటి క్లిష్ట సమయంలో ప్రముఖ ట్రాక్టర్ తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా రైతులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ స్కీమ్ ద్వార కొత్తగా ట్రాక్టర్ కొనుగోలు చేసే వారికి లక్ష రూపాయల వరకు బెనిఫిట్ లభించనుంది. మహీంద్రా ట్రాక్టర్ల కంపెనీ అన్నదాతల కోసం ఎం ప్రొటెక్స్ కోవిడ్ ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. ఇది హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ప్రిఅప్రూవ్డ్ ఎమర్జెన్సీ ఫైనాన్షియల్ సపోర్ట్ పాలసీ అన్న మాట. ఈ పాలసీ కింద రైతులు లక్ష రూపాయల వరకు ఆర్థిక ప్రయోజనం పొందవచ్చు. కొత్తగా మహీంద్రా ట్రాక్టర్ కొనే రైతులకు కంపెనీ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ప్రిఅప్రూవ్డ్ ఎమర్జెన్సీ ఫైనాన్షియల్ సపోర్ట్ పాలసీని అందిస్తుంది.
ఈ సరికొత్త ఫైనాన్సియల్ అండ్ హెల్త్ పాలసీ రైతులకు, వారి కుటుంబాలకు కరోనా నుంచి రక్షణ కల్పిస్తుందని మహీంద్రా కంపెనీ తెలిపింది. కరోనా వైరస్ సోకితే ఈ ఇన్సూరెన్స్ పాలసీ కింద లక్ష రూపాయల వరకు ఆర్ధిక సాయం లభిస్తుంది. ఈ లక్ష రూపాయలతో కరోనాకు ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవచ్చన్న మాట. అంతే కాదు హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ప్రిఅప్రూవ్డ్ ఎమర్జెన్సీ ఫైనాన్షియల్ సపోర్ట్ పాలసీ కింద రైతులకు ఈ కష్టకాలంలో ప్రిఅప్రూవ్డ్ రుణాలు కూడా ఇస్తామని మహీంద్రా కంపెనీ స్పష్టం చేసింది. అనుకోని పరిస్థితుల్లో రుణం తీసుకుని ట్రాక్టర్ కొనుగోలు చేసిన రైతు మరణిస్తే మహీంద్రా లోన్ సురక్ష కింద రుణానికి ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. అంటే రైతు తీసుకున్న లోన్ మొత్తాన్ని ఇన్సూరెన్స్ చెల్లిస్తుంది. ఇక రైతు కుటుంబం ఆ లోన్ కట్టక్కర్లేదు. ఈ పాలసీ వల్ల కరోనా కష్టకాలంలో రైతులకు ఆర్థిక చేయూత ఇవ్వడం కోసం ఈ ప్రత్యేక పాలసీని ప్రవేశపెట్టినట్లు మహీంద్రా కంపెనీ పేర్కొంది.