కర్నూలు- మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబుపై కర్నూలులో క్రిమినల్ కేసు నమోదైంది. కర్నూలులో ఎన్ 440కే వైరస్ ఉందన్న చంద్రబాబు వ్యాఖ్యలతో సామాన్య జనాలు భయాందోళనకు గురి అవుతున్నారని సుబ్బయ్య అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలు పోలీసులు చంద్రబాబు పై కేసు నమోదు చేశారు. ఐపీసీ 188,505(1)(బి)(2) సెక్షన్ల కింద చంద్రబాబుపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అంతే కాకుండా 2005 ప్రకృతి వైపరీత్యాల చట్టంలోని సెక్షన్ 54 కింద నాన్ బెయిల్ సెక్షన్లను నమోదు చేశారు. కర్నూలో ఎన్ 440 కే రకం కరోనా వైరస్ ఉందని, కానీ జగన్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదని, ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందని చంద్రబాబు రెండు రోజుల క్రితం ఆరోపించాారు. ఐతే కర్నూలులో కరోనా సోకిన రోగుల నుంచి స్వాబ్ ను సేకరించి సీసీఎంబీ పరీక్షించింది.
ఈ పరీక్షల్లో కర్నూలులో ఎన్ 440 కే రకం కరోనా వైరస్ వెేరియంట్ లేదని తేలిందని నిపుణులు స్పష్టం చేశారు. దీంతో చంద్రబాబు స్టేట్ మెంట్ వల్ల ప్రజలు పెద్ద ఎత్తున భయాందోళనలు చెందారని. కరోనా లాంటి క్లష్ట సమయంలో బాబు రాజకీయం చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు. ఇక ఇప్పుడు ఇలా చంద్రబాబుపై పోలీసులకు పిర్యాదు అందడంతో నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. చంద్రబాబుపై పోలీసులు కేసులు నమోదు చేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. సీఎం జగన్ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబుపై కేసులు నమోదు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.