బ్రహ్మ దేవుడు రాసిన తలరాతని ఎవ్వరూ మార్చలేరు అంటారు. కానీ.., మనిషి తలుచుకుంటే మార్చలేనిది అంటూ ఏది లేదు. జీవితంలో ఎదగాలన్న కసి, పట్టుదల ఉంటే చాలు. ఎంతటి కష్టాన్నైనా దాటవచ్చు. ప్రస్తుతం ఈ విషయాన్నే నిజం చేసి చూపించింది కేరళకి చెందిన 28 ఏళ్ల సెల్వమరి. ఓ సాధారణ దినసరి కూలీ అయిన సెల్వమరి జీవితం ఇప్పుడు దేశంలో కొన్ని లక్షల మందికి స్ఫూర్తి దాయకంగా నిలుస్తోంది. ఇంతకీ ఎవరీ సెల్వమరి? ఈమె సాధించిన ఘనత ఏమిటి? తెలుసుకుందాం రండి.
కేరళకి చెందిన సెల్వమరి బాల్యం అంతా కష్టాల మధ్యనే సాగింది. ఆమె తండ్రి పచ్చి తాగుబోతు. భార్య, ఇద్దరు చిన్న బిడ్డలను వదిలేసి ఎటో వెళ్ళిపోయాడు. దీంతో.., సెల్వమరి చాలా తక్కువ వయసులోనే తల్లితో కలసి యాలకుల తోటలో కూలీగా మారింది. కానీ.., ఆమె చదువుని మాత్రం వదలలేదు. అర్ధరాత్రిళ్లు నూనె దీపాన్ని పెట్టుకొని చదువుకునేది. చదువొక్కటే తమ జీవితాలను మారుస్తుందని ఆమె నమ్మకం. సెల్వమరికి గణితం అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ గణితంలో ప్రతిభ చూపుతుండేది. తిరువనంతపురం ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో చేరినప్పుడు తల్లికి ధైర్యం చెప్పింది. కాలేజీకి సెలవు రోజులు ఇవ్వగానే తిరిగి ఇంటికి వచ్చి, తల్లితో కలిసి కూలి పనులకు వెళ్లేది. అలా వేసవి సమయమంతా తల్లికి చేదోదు వాదోడుగా ఉండేది. డిగ్రీ, అటు తర్వాత ఎమ్మెస్సీ పూర్తి చేసింది.
సెల్వమరి తరువాత కాలంలో కుమిలీలోని ఎంజి యూనివర్శిటీ నుంచి బీఈడీ, ఎమ్ఈడీ పూర్తి చేసింది. థైక్వాడ్ గవర్నమెంట్ కాలేజీ నుంచి ఎంఫిల్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది. ఇప్పుడు మ్యాథమేటిక్స్లో పీహెచ్డీ చేస్తోంది. ఇక సెల్వమరి తాజాగా కేరళలోని ఇడుక్కి జిల్లాల్లో వంచివయాల్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించింది. నిన్న మొన్నటి వరకు తాను కూలీగా తిరిగిన ప్రాంతంలోనే ఇప్పుడు ఆమె ఓ స్థాయిని అందుకుంది. తమ మధ్య తిరిగిన అమ్మాయి.. ప్రభుత్వ ఉద్యోగిగా ఎదగడంతో ఆ ఊరిలో కూలీలు, రైతులు కూడా తెగ సంతోష పడుతున్నారు. కానీ.., సెల్వమరి ఇక్కడితో ఆగిపోవాలి అనుకోవడం లేదు. సివిల్ సర్వీసులలో రాణించి కలెక్టర్ అవ్వాలన్నది ఆమె కోరిక.
ఇలా స్వయంకృషితో ఎదిగిన సెల్వమరికి కేరళ గవర్నర్.. ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఫోన్ ద్వారా, ట్విటర్ వేదికగా అభినందనలు తెలపడం విశేషం. ఏదేమైనా.. జీవితంలో ఎదగాలనుకునే వారికి సెల్వమరి ప్రస్థానమే ఓ స్ఫూర్తిదాయకం. మరి.., ఈ చదువుల తల్లి సాధించిన విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
Hon’ble Governor Shri Arif Mohammed Khan congratulated over phone, Ms. Selvamari, on becoming a high school teacher in Idukki after struggling years as daily labourer in cardamom estate to pursue studies. With MSc,MEd& 1st rank in MPhil, she now pursues PhD:PRO,KeralaRajBhavan pic.twitter.com/4vOGIPKlYd
— Kerala Governor (@KeralaGovernor) July 26, 2021