స్పెషల్ డెస్క్- ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. ఈ ప్రతిష్టాత్మ విద్యా సంస్థలో చదువుకోవడం అదృష్టం అని చెప్పుకోవాలి. అవును ఐఐటీలో చదువుకుంటే దాదాపు జాబ్ గ్యారంటీ. అది కూడా ఎవరు ఊహించనంత వేతనంతో ఉద్యోగాలు పొందుతున్నారు ఐఐటీ విద్యార్ధులు. ఎప్పటిలా ఈ సంవత్సరం కూడా ఐఐటీ క్యాంపస్ ప్లేస్ మెంట్స్ లో ఐఐటీ విధ్యార్ధులు భారీ వేతనాలతో ఉద్యోగాలు దక్కించుకున్నారు.
దేశంలో పలు ఐఐటీల్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ బుధవారం నుంచి ప్రారంభం అయ్యాయి. విద్యార్థులకు భారీ వేతనాలు ఇవ్వడానికి ఐటీ సంస్థలు ముందుకు వచ్చాయి. గత సంవత్సరం కంటే ఈ యేడాది విద్యార్ధులకు అధిక ప్యాకేజీలు దక్కుతున్నాయి. అత్యుత్తమ ఆవిష్కర్తలను ఐఐటీలు తయారు చేస్తున్నాయని నమ్ముతున్న బహుళజాతి సంస్థలు, అక్కడి విద్యార్థులకు మంచి ఆఫర్లు ఇస్తున్నాయి. ఈ సంవత్సరం క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఐఐటీ రూర్కీ విద్యార్ధి లక్కీ ఛాన్స్ కొట్టేశాడు.
ఐఐటీ రూర్కీ విద్యార్ధి ఏడాదికి 2.15 కోట్ల వేతనంతో ప్రముఖ అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఉద్యోగం ఇచ్చింది. మరోవైపు బాంబే ఐఐటీ విద్యార్థికి 2.05 కోట్లు వేతన ప్యాకేజీ దక్కింది. ఉబర్ సంస్థ ఈ భారీ మొత్తాన్ని చెల్లించడానికి ముందుకొచ్చిందట. ఇక ఐఐటీ గౌహతి విద్యార్థికి కూడా దాదాపు 2 కోట్ల ప్యాకేజీని ఆఫర్ చేసిందట మరో టెక్ కంపెనీ. మైక్రోసాఫ్ట్, క్వాల్కమ్, గూగుల్, బోస్టర్ కన్సల్టింగ్ గ్రూప్, ఎయిర్ బస్, అమెజాన్, యాపిల్, ఏపీటీ పోర్ట్ ఫోలియో, బజాజ్ ఆటో లిమిటెడ్ వంటి సంస్థల్లో దేశీయ ఉద్యోగాలు, ఉబర్, రుబ్రిక్ సహా ఇతర సంస్థల్లో అంతర్జాతీయ ఉద్యోగాలకు దేశ వ్యాప్తంగా ఐఐటీల్లో క్యాంపస్ ప్లేస్ మెంట్లు జరగుతున్నాయి.
గత సంవత్సరం ఐఐటీ బాంబే విద్యార్థికి అమెరికాకు చెందిన కొహెసిటీ సంస్థ ఇచ్చిన 1.54 కోట్లే ఇప్పటి వరకు అత్యధికం వేతనం. కరోనా నేపధ్యంలో ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ లు తీవ్ర ప్రభావం చూపాయి. లక్షలాది మంది ఉద్యోగాలను కోల్పోయారు. కరోనా సద్దుమణిగిన తర్వాత మార్కెట్ లు క్రమంగా కోలుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో 11 మంది ఐఐటీ రూర్కీ విద్యార్థులకు కోటి రూపాయలకు పైగా వేతనంతో ఆఫర్లు వరించాయి. ఇటీవలే ట్విట్టర్ కు కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టిన పరాగ్ అగర్వాల్ ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థే కావడం విశేషం.