హైదరాబాద్ : అవయవదానం ప్రాణదానంతో సమానమని తెలంగాణ ఆరోగ్య శాఖామంత్రి హరీష్ రావు అన్నారు. రవీంద్రభారతిలో శనివారం జరిగిన జీవన్ధన్ 11వ దాతల సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ అవయవదానం గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అవయవదానం చేసిన వారి కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. అవయవదానం చేసి మరొకరికి పునర్జన్మ నిచ్చిన దాతలు దేవుడితో సమానం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అవయవదానం చేసి అనేకమంది ప్రాణాలు కాపాడిన అవయవదాతలను స్మరించుకునేలా వారి కుటుంబ సభ్యులను గౌరవించుకొనే విధంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం పట్ల నిర్వహకులను అభినందించారు. ఇప్పటి వరకు అవయవదానంతో 3,800 మంది పునర్జన్మ పొందారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యసేవలు ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పారు. ప్రజలు వైద్యం కోసం ప్రభుత్వ హాస్పిటల్స్ కు ఎంతో ధైర్యంగా వెళ్లే విధంగా హాస్పిటల్స్ ను తీర్చిదిద్దడం జరిగిందని ఆయన వివరించారు. కోట్లాది రూపాయల వ్యయంతో ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్స్ లో అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉంచడం జరిగిందని పేర్కొన్నారు. ప్రజలలో ఆరోగ్యం విషయంతో ఎంతో శ్రద్ధ పెరిగిందని, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. త్వరలోనే నగరం నలుమూలలా మూడు మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ రానున్నాయని అన్నారు. కరోనా సమయంలో కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలకు గాంధీ హాస్పిటల్ కేరాఫ్ గా మారిందని, అది కూడా ప్రభుత్వ హాస్పిటల్ కావడం ప్రభుత్వ వైద్య సేవలకు నిదర్శనం అన్నారు.