అమరావతి- నైరుతి రుతుపవనాల ప్రభావం ఆంద్రప్రదేశ్ పై స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీలో రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయి. దీంతో రానున్న రెండు మూడు రోజులు రాష్ట్రంలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ మీదుగా పశ్చిమ, నైరుతి దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నాయి. కోస్తాంధ్రలో సముద్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం సూచించింది.
ఉత్తర కోస్తాలో గురువారం ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు, కొన్ని ప్రాంతాల్లో ఉక్కపోత ఉండింది. మరోవైపు సముద్రం నుంచి తేమగాలులు వీచాయి. ఈ రెండింటి ప్రభావంతో ఉత్తరకోస్తాలో వాతావరణ అనిశ్చితి నెలకొని సాయంత్రం పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. కోస్తాలోని మిగిలిన ప్రాంతాలు, రాయలసీమలో ఎక్కువచోట్ల మేఘాలు విస్తరించినా పొడి వాతావరణం కనిపించింది. శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇక నైరుతి రుతుపవనాలు రాజస్థాన్లో ప్రవేశించడానికి వాతావరణ పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవని భారత వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న 2, 3 రోజుల్లో గుజరాత్, ఉత్తరప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు నిదానంగా ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరించడానికి మరో వారం రోడుల సమయం పట్టవచ్చని వాచావరణ శాఖ అంచనా వేస్తోంది.