ఇటీవల జాన్స్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ (సీటీవై) ప్రపంచంలో తెలివైన విద్యార్థి ఎవరన్న ప్రోగ్రామ్ నిర్వహించింది. ఈ ప్రోగ్రామ్ లో 76 దేశాలకు చెందిన 15 వేలకు మందికి పైగా విద్యార్థులు పాల్గొనగా.. ఓ బాలిక తెలివైన విద్యార్థిగా ఎన్నికైంది.
మనిషి జీవితంలో అందమైనది విద్యార్థి దశ. అల్లరి చేయాలన్నా, నేర్చుకోవాలన్నా ఈ దశలోనే. ఈ దశలో పోటీ తత్వం కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. ఆ స్నేహం కూడా వేరు. అందుకే ప్రతి విద్యార్థికి ఈ దశ చాలా కీలకమైంది. తెలివి తేటలు కూడా మెండుగా ఉంటాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. ఇటీవల జాన్స్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ (సీటీవై) ప్రపంచంలో తెలివైన విద్యార్థి ఎవరన్న ప్రోగ్రామ్ నిర్వహించింది. ఇందులో మొత్తంగా 76 దేశాలు పాల్గొన్నాయట. సుమారు 15 వేల మందికి పైగా విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనగా.. ఆ విజేతను ప్రకటించారు.
ఇంతకు ఆ విజేత ఎవరంటే..సమేత సక్సేనా. భారతీయ-అమెరికన్ విద్యార్థి సమేత సక్సేనాను ప్రపంచంలోని తెలివైన విద్యార్థిగా తేలింది. ప్రస్తుతం న్యూయార్క్లోని బ్యాటరీ పార్క్ సిటీ స్కూల్లో నాల్గవ తరగతి చదువుతున్న సమేతకు తొమ్మిదేళ్లు. 8 సంవత్సరాల వయస్సులో గ్లోబల్ టాలెంట్ సెర్చ్ ప్రోగ్రామ్కు అర్హత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా మారింది. జాన్స్ హాప్కిన్స్ సీటీవై ప్రోగ్రామ్లో విద్యార్థులను ఉన్నత స్థాయి పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. విశ్వవిద్యాలయ పత్రికా ప్రకటన ప్రకారం, సమేత.. ఎస్ఏటీ, ఏసీటీ, స్కూల్ అండ్ కాలేజ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లేదా సీటీవై అసెస్మెంట్ టాలెంట్ సెర్చ్లో అసాధారణ ప్రతిభ కనబర్చి ‘ప్రపంచంలోని తెలివైన విద్యార్థిని’గా గుర్తింపు పొందింది.
మొత్తంగా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్న 15,300 మంది విద్యార్థులు వారి మార్కుల ఆధారంగా ప్రత్యేక సన్మానాలు పొందారు. ఇది కేవలం మా విద్యార్థులు పరీక్షలలో సాధించిన విజయానికి గుర్తింపు మాత్రమే కాదని, ఇది వారి చిన్న జీవితంలో ఇప్పటివరకు వారు సంపాదించిన అన్ని విజ్ఞానానికి గుర్తింపు ఇదని సీటీవై ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. అమీ షెల్టాన్ అన్నారు. గత సంవత్సరం, జాన్ హాప్కిన్స్ నిర్వహించిన స్ప్రింగ్ 2021 పరీక్షలో 5వ తరగతి విద్యార్థిని నటాషా పెరియనాయగం ‘వరల్డ్స్ స్మార్టెస్ట్ స్టూడెంట్’గా ఎంపికైంది. ఆమెకు 13 ఏళ్లు. న్యూజెర్సీలోని ఫ్లోరెన్స్ M. గౌటినర్ మిడిల్ స్కూల్లో చదువుతోంది.