తొలి కరోనా వేవ్ను ఫేస్ చేసిన దేశ ప్రజలు ప్రస్తుతం సెకండ్ వేవ్తో యుద్ధం చేస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో థర్డ్వేవ్ ముప్పు కూడా ఉందని ఇప్పటికే వైద్య నిపుణులు చెబుతున్నారు. చిన్నపిల్లలపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డీజీహెచ్ఎస్ పిల్లలకు కోవిడ్-19తో పెద్ద ప్రమాదం లేదని ఊరటనిచ్చే విషయాన్ని చెప్పింది. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో దుష్ప్రభావాలు అతి తక్కువగానే నమోదవుతున్నాయని డీజీహెచ్ఎస్ తెలిపింది.
పిల్లలకు కరోనాతో పెద్ద ప్రమాదం లేదని అయినప్పటకీ అలసత్వం ప్రదర్శించకుండా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలని సూచించింది. 18 ఏళ్లలోపు పిల్లలకు ప్రస్తుతం ఎలాంటి టీకాలు అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో డీజీహెచ్ఎస్ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనాను కట్టడి చేయాలంటే ప్రధానమైంది మాస్కు ధరించడం. అయితే ఐదేళ్లలోపు పిల్లలకు మాస్క్ వినియోగించాల్సిన అవసరంలేదు. వారు మాస్క్ సరిగ్గా పెట్టుకోకపోవడం ద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇక ఐదేళ్ల నుంచి 12ఏళ్లలోపు పిల్లలు తల్లిదండ్రులు, పెద్దల సమక్షంలోనే మాస్కు ధరించాలి.
పన్నెండేళ్లు పైబడినవారంతా పెద్దలతో సమానంగా మాస్క్ పెట్టుకోవాలి. పిల్లల్లో సాధారణంగా తీసుకునేదాని కంటే ఎక్కువసార్లు శ్వాస తీసుకుంటున్నట్లు గుర్తిస్తే సమస్య ఉన్నట్లేనని భావించాలని డీజీహెచ్ఎస్ స్పష్టం చేసింది. ప్రస్తుతం కరోనా బాధితుల్లో ఎక్కువమంది సీటీ స్కాన్ తీయించి స్కోర్ చూస్తున్నారు. పిల్లల విషయానికి వచ్చేసరికి సీటీ స్కాన్ పనికి రాదు. దీనికి బదులుగా చెస్ట్ ఎక్స్రేతో పరిస్థితిని సమీక్షించవచ్చు. పిల్లలకు కోవిడ్ వచ్చి తగ్గిన రెండు వారాల తర్వాత మూడు రోజుల కంటే ఎక్కువ జ్వరం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
శరీరంపై రాషెస్, కళ్లు ఎరుపుగా ఉండడం, వాంతులు, కడుపులో నొప్పి తదితర లక్షణాలు గుర్తిస్తే వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలి. అలాగే కరోనా చికిత్స పొందిన చిన్నారులు అతి తక్కువ మందిలో బ్లాక్ ఫంగస్ సోకే అవకాశం కూడా ఉంది. లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స అందించాలని డీజీహెచ్ఎస్ వెల్లడించింది.