దేశంలో ఓ వైపు పేదరికం, నిరుద్యోగం అంతకంతకూ పెరిగిపోతోంది. మరోవైపు దేశంలోని సంపన్నులు మరింత ధనవంతులుగా ఎదుగుతూనే ఉన్నారు. సంపాదించిన సొమ్ము స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటున్నారు. స్విస్ బ్యాంకుల్లో భారతీయ సంపన్నులు దాచుకున్న సంపద మరోసారి భారీగా పెరిగింది. దాదాపు 20 వేల 700 కోట్ల రూపాయలు స్విడ్జర్లాండ్లోని బ్యాంకుల్లో దాచుకున్నట్లు ఆ దేశ జాతీయ బ్యాంకు తెలిపింది. 2019లో 6 వేల 625 కోట్లు ఉన్న భారతీయుల సంపద ఒక్కసారిగా పెరిగినట్లు స్విస్ బ్యాంకు చెప్పింది. 2011 తర్వాత ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటి సారి అని స్పష్టం చేసింది.
2006 నాటికి భారతీయులు దాచుకున్న డబ్బు రూ.23 వేల కోట్లు నల్లధనాన్ని అరికట్టేందుకు గాను భారత్, స్విట్జర్లాండ్తో కుదుర్చుకున్న సమాచార మార్పిడి ఒప్పందం మేరకు స్విస్ బ్యాంక్ ఈ వివరాలను వెల్లడించింది. భారతీయులు 2007 వరకు బినామీల పేరిట భారీగా డిపాజిట్లు ఉండేవని, కానీ ఆ తరువాత అవి క్రమంగా తగ్గిపోయాయని తెలిపింది. గుజరాత్,ముంబయి,కోల్కత,బెంగళూరు ప్రాంతాలకు చెందిన బిగ్ షాట్స్ పోగేసిన సంపదను స్విస్ బ్యాంకుల్లో అత్యధికంగా ఉన్నట్టు సమాచారం.
ఓవైపు నల్లధనాన్ని అరికట్టేందుకు తాము తీసుకున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని ప్రభుత్వాలు ఊదరగొడుతున్నప్పటికీ మరోవైపు భారతీయ సంపన్నుల ధనం స్విస్ బ్యాంకులకు తరలిపోతున్నది.