వైద్య శాస్త్రంలో ఎంతో అభివృద్ధి సాధించాం అని సంబరపడేలోపే.. కొత్త కొత్త మహమ్మారులు మానవులపై దాడి చేసి.. నూతన సవాళ్లు విసురుతున్నాయి. వాటిని చేధించడానికి దశాబ్దాల కలం పడుతుంది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాతో పోరాడేందుకు వ్యాక్సిన్ లను అభివృద్ధి చేశారు.. చేస్తున్నారు. కానీ కోవిడ్ కన్నా దశాబ్దాల ముందే హెచ్ఐవీ, ఎయిడ్స్ మానవులు మీద దాడి ప్రారంభించింది. 1981 సంవత్సరంలో అమెరికాలో మొదటి ఎయిడ్స్ కేసు నమోదయ్యింది. ఈ వైరస్ వెలుగు చూసి ఇప్పటికి 40 సంవత్సరాల పైనే అవుతున్నా.. ఇంతవరకు దీన్ని పూర్తి స్థాయిలో తగ్గించే ఔషధాన్ని అభివృద్ధి చేయలేకపోయారు. ప్రస్తుతానికి వివిధ రకాల చికిత్సల ద్వారా.. వ్యాధి సోకిన వారి ఆయుర్దాయాన్ని అయితే పెంచగల్గుతున్నారు కానీ.. వ్యాధిని పూర్తిగా తగ్గించలేకపోతున్నార. ఎయిడ్స్ను పూర్తిగా రూపుమాపే ఔషధం కోసం ఏళ్ల తరబడి పరిశోధనలు జరగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అమెరికా డాక్టర్లు ఓ శుభవార్త చెప్పారు. ఆవివరాలు..
అమెరికాకు చెందిన ఓ మహిళ ఎయిడ్స్ని జయించినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. హెచ్ఐవీ నుంచి పూర్తిగా బయటపడిన మూడవ వ్యక్తిగా, తొలి మహిళగా నిలిచారు. సదరు మహిళ క్యాన్సర్, ఎయిడ్స్ వంటి రెండు ప్రాణాంతక వ్యాధులతో ఏకకాలంలో బాధపడసాగింది. ఇక క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఆమెకు స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ చేశారు వైద్యులు. ఆ తర్వాత 14 నెలలుగా ఆమెలో ఎయిడ్స్ లక్షణాలేవి కనిపించలేదని గుర్తించారు. దీనిపై పరిశోధనలు చేయగా సదరు మహిళకు స్టెమ్ సెల్ ఇచ్చిన దాతకు హెచ్ఐవీ వైరస్ పై పోరాడే సహజ సామర్థ్యం ఉన్నట్లు గుర్తించారు. అందువల్లే స్టెమ్ సెల్ పొందిన బాధితురాలు ఎయిడ్స్ నుంచి బయటపడినట్లు వైద్యులు తెలిపారు.
స్టెమ్ సెల్ చికిత్స అంటే ఏంటి..
బిడ్డ పుట్టగానే బొడ్డుతాడు నుంచి సేకరించిన రక్తాన్ని భవిషత్తులో అనేక వ్యాధుల చికిత్సలో వినియోగిస్తారు. బిడ్డ పుట్టగానే బొడ్డుతాడు నుంచి రక్తం సేకరించి భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుస్తారు. ఎయిడ్స్ బారిన పడిన సదరు మహిళకు ఓ దాత.. బొడ్డుతాడు నుంచి సేకరించిన స్టెమ్ సెల్ ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. ఈ సెల్స్ లో ఎయిడ్స్ వ్యాధి కారకమైన వైరస్ ను ప్రతిఘటించే ఫంక్షనల్ క్యూర్ అనే గుణం ఉంది. ఇది దాత శరీరంలో సహజసిద్ధంగా ఉందని వైద్యులు తెలిపారు. దీనిపై అధ్యయనం చేసిన అమెరికా పరిశోధకులు ఆ వివరాలను వెల్లడించారు. ఇది ఇంకా పీర్ రివ్యూడ్ జర్నల్ లో పబ్లిష్ కావాల్సి ఉంది. అయితే ఈ చికిత్స కొద్ది మంది పేషెంట్లకు మాత్రమే సాధ్యమవుతుంది. ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమై.. హెచ్ఐవీ కూడా ఉండి… అలాంటి వారికి మ్యాచింగ్ డోనర్ దొరికితేనే సాధ్యం అంటున్నారు.
ఈ సదర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. ‘‘ఈ పద్ధితిలో హెచ్ఐవీకి చికిత్స అందిస్తున్న మూడో కేసు ఇది. ప్రస్తుత ఫలితాలతో హెచ్ఐవీకి చికిత్స సాధ్యమని నిరూపణ అవుతోంది. వాస్తవానికి సదరు మహిళ క్యాన్సర్ కు చికిత్స తీసుకుంటున్నారు. ఆ క్రమంలోనే ఆమెకు ఒక డోనర్ ద్వారా బొడ్డు తాడు రక్తం లభించింది. స్టెమ్ సెల్ చికిత్స తర్వాత సదరు మహిళ హెచ్ఐవీ చికిత్స యాంటీరెట్రోవైరల్ థెరపీ చేయించుకోలేదు. ఈ చికిత్స పొందుతున్న తొలి మహిళ ఇమె. హైచ్ఐవీని జయించిన మూడో వ్యక్తిగా నిలిచారు. ఇక హెచ్ఐవీ నుంచి విముక్తి పొందిన తొలి వ్యక్తి తిమోతీ రే బ్రౌన్. 2018లో ఆయన ఎయిడ్స్ ని జయించారు. 2007లో ఆయనకు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ చికిత్స జరిగింది. అతడికి బోన్ మారో ఇచ్చిన దాతకు హెచ్ఐవీ రెసిస్టెన్స్ ఉంది. అయితే తిమోతీ ఎయిడ్స్ని జయించారు కానీ.. 2020లో ఆయన క్యాన్సర్ తో ప్రాణాలు విడిచారు’’ అని తెలిపారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.