కోవిడ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో నష్టం వాటిల్లింది. జననష్టం, ఆస్తి నష్టం సహా అన్ని నష్టాలు అతలాకుతలం చేస్తున్నాయి. కరోనా కొత్త వేరియంట్లు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో చాలా ఈవెంట్లు వాయిదా పడ్డాయి. అలా వాయిదా పడ్డ వాటిల్లో ఒలింపిక్ గేమ్స్ కూడా ఉన్నాయి. గత ఏడాది జరగాల్సిన ఈ ఆటలు, ఈ ఏడాది ప్రారంభం కానున్నాయి. టోక్యో వేదికగా మరికొద్ది రోజుల్లో మొదలు కానుంది. ఐతే ఈ ఆటలకు ప్రేక్షకులకు అనుమతి ఇవ్వడం లేదు. టోక్యో సహా ఇతర నగరాల్లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతుండటంతో అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకున్నది. ప్రేక్షకులు లేకుండానే ఒలింపిక్స్ నిర్వహించనున్నామని ప్రకటించింది. జపాన్ ప్రధాని యొషిహిదే సుగా నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి కమిటీ భేటీ దేశంలో నాలుగో సారి ఎమర్జెన్సీ విధించాలని నిర్ణయం తీసుకున్నది. ఆ వెంటనే జపాన్ ఒలింపిక్ మంత్రి తమాయో మరుకావా ప్రేక్షకులను పూర్తిగా నిషేధిస్తున్నట్లు తమ నిర్ణయాన్ని ప్రకటించారు. జులై 12 నుంచి జులై 22 వరకు దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించింది.
సరిగ్గా ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు రోజు వరకు ఎమర్జెన్సీ అమలులో ఉంటుంది. ఎమర్జెన్సీ ఆంక్షలతో సమ్మర్ ఒలింపిక్స్ , ఆ తర్వాత పారాలింపిక్స్ కూడా జరుగుతాయిని జపాన్ సర్కర్ స్పష్టం చేసింది. జపాన్ వాసులు అందరూ టీవీల్లో ఒలింపిక్స్ వీక్షించాలని ప్రభుత్వం సూచించింది. పార్టీల కోసం ఎవరూ రోడ్లపై చేరవద్దని అందరూ క్రమ శిక్షణ పాటించాలని కోచింది. ప్రపంచ దేశాలు పోటీ పడే వివిధ ఆటలను ప్రత్యక్షంగా చూడలేకపోవడం క్రీడాభిమానులకు బాధాకరమే.