గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా మారుమొగుతున్న పేరు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ). మరీ ముఖ్యంగా గత వారం రోజుల నుంచి దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ కార్యాలయాలు, నాయకులు, సభ్యుల ఇళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పెద్ద ఎత్తున దాడులు నిర్వహించాయి. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా 11 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి 106 మంది పీఎఫ్ఐ సభ్యులను అరెస్ట్ చేశాయి. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ఐ ట్విట్టర్ ఖాతాను గురువారం నుంచి నిలిపివేసింది. ఈ సంస్థలకు ఉగ్రసంస్థలతో సంబంధాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో పీఎఫ్ఐపై కేంద్రం హోం శాఖ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. పీఎఫ్ఐతో పాటు.. మరో ఎనిమిది అనుబంధ సంస్థలపై కూడా నిషేధం విధించింది.
అయితే డిజిటల్ మీడియా వేదికగా.. ఈ సంస్థ తన కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉడంటంతో.. పీఎఫ్ఐకి చెందిన అన్ని వెబ్సైట్లు, సోషల్ మీడియా అకౌంట్లను బ్యాన్ నిలిపివేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు నిరసనగా కేరళ, తమిళనాడులో పీఎఫ్ఐ సభ్యులు నిరసనలు చేశారు. మరీ ఇంతకు ఈ పీఎఫ్ఐ అంటే ఏమిటి.. ఎందుకు కేంద్రం దీనిపై నిషేధం విధించింది వంటి పూర్తి వివరాలు..
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) 2006లో ఏర్పాటైంది. ప్రారంభంలో ఈ సంస్థ తమది ఒక సామాజిక, స్వచ్ఛంద సంస్థ అని, పేదలు, అణగారిన వర్గాల కోసం సేవలు అందించడం, దోపిడీపై పోరాడటం తమ లక్ష్యమని పేర్కొంది. కేరళకు చెందిన వివాదాస్పద నేషనల్ డెవలప్మెంట్ ఫ్రంట్తో పాటు మరి కొన్ని సంస్థలను కలిపి పీఎఫ్ఐగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇది కేరళ, కర్నాటకల్లో యాక్టీవ్గా ఉంది. మరో 20 రాష్ట్రాల్లో దీనికి వేల మంది కార్యకర్తలు ఉన్నారు. పేద, అణగారిన వర్గాల వారికి సేవ చేయడం కోసం ఏర్పడ్డట్లు చెప్పుకొన్నప్పటికి.. ఈ సంస్థ పని తీరు మాత్రం ప్రారంభం నుంచి వివాదాస్పదంగా మారింది. రాజ్యద్రోహం, రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టడం, భారత్లో అలజడులు సృష్టించడం వంటి ఆరోపణలు ఈ సంస్థపై ఉన్నాయి.
ఈ క్రమంలో 2011లో ఎర్నాకుళానికి చెందిన మలయాళ ప్రొఫెసర్ టీజే జోసెఫ్ దాడి చేసులో కూడా ఈ సంస్థ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక ఈ ఏడాది జూన్లో రాజస్తాన్లో ఒక హిందూ వ్యక్తి తల నరికిన కేసులో పీఎఫ్ఐ సభ్యుల ప్రమేయముందని పోలీసులు ఆరోపణలు చేశారు. కొన్ని నెలల క్రితం బిహార్లో భారత్ను ఇస్లామిక్ దేశంగా మారుస్తామంటూ ఓ కరపత్రం విడదల అవ్వడం అప్పట్లో సంచలనంగా మారింది. అలానే ఈ ఏడాది ప్రారంభంలో కర్ణాటకలో చోటు చేసుకున్న హిజాబ్ వివాదం వెనక పీఎఫ్ఐ ఉన్నట్లు వార్తలు వచ్చాయి.. వీటన్నింటికన్నా ముఖ్యంగా పీఎఫ్ఐకి సిమితో సంబంధాలు ఉన్నాయన్నది ప్రధాన ఆరోపణ. అంతేకాక మరో నిషేధిత సంస్థ ఇండియన్ ముజాహిదీన్తోనూ సంబంధాలున్నాయని తాజాగా ఆరోపణలు వచ్చాయి.
నిషేధిత రాడికల్ ఇస్లామిస్ట్ సంస్థ ‘స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా’ (సిమి)కి పీఎఫ్ఐ మరో రూపమని ఆ సంస్థ ఏర్పడినప్పటి నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే.. చాలామంది సిమి కార్యకర్తలు పీఎఫ్ఐలో సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సిమిని ఉగ్రవాద సంస్థగా ప్రకటించడమేకాక.. దానిపై నిషేధం విధించింది. ఇండియన్ ముజాహిదీన్తో సిమికి సంబంధాలున్నట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో సిమిని నిషేంధించిన తర్వాత.. దాని స్థాపకులే పీఎఫ్ఐని స్థాపించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
ఈ ఏడాది ప్రారంభంలో కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం, అనంతరం ఘర్షణలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిందని పీఎఫ్ఐపై కర్నాటక ప్రభుత్వం ఆరోపణలు చేసింది. మరోవైపు పీఎఫ్ఐకు చెందిన మహిళ, విద్యార్థి సంఘాలు హిజాబ్ అనుకూల నిరసనల్లో పాల్గొన్నాయని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. పీఎఫ్ఐకు అనేక క్రిమినల్, తీవ్రవాద కేసులలో ప్రమేయం ఉన్నట్లు పలు సందర్భాల్లో నిరూపితం అయ్యింది. ఇది బయటి నుంచి నిధులు తీసుకుంటూ దేశ అంతర్గత భద్రతకు పెద్ద ముప్పుగా పరిణమించింది అని కేంద్ర హోం శాఖ తాజాగా వెల్లడించింది.
పీఎఫ్ఐకు అనేక తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉంది. పలువురు వ్యక్తుల హత్యలతో సంబంధం ఉంది. పీఎఫ్ఐ ముఖ్యులు, దానితో అనుబంధం ఉన్నవారు.. బ్యాంకింగ్ మార్గాలు, హవాలా, విరాళాల ద్వారా ఒక ప్రణాళికతో భారతదేశం లోపల, వెలుపల నిధులను సేకరిస్తున్నారు. ఆ డబ్బును చట్టబద్ధం చేయడానికి వేర్వురు ఖాతాల ద్వారా లేయరింగ్ చేస్తున్నారు. దేశంలో వివిధ నేర, చట్టవిరుద్ధమైన తీవ్రవాద కార్యకలాపాలకు ఈ నిధులను ఉపయోగిస్తారు.
పీఎఫ్ఐ సంబంధిత బ్యాంకు ఖాతాలలో జమ చేసిన డబ్బు మూలాలు ఖాతాదారుల ఆర్థిక ప్రొఫైల్తో సరిపోలడం లేదు. అలాగే పీఎఫ్ఐ విధులు అది పేర్కొన్న లక్ష్యాలకు అనుగుణంగా లేవు. అందువల్ల, ఆదాయపు పన్ను శాఖ, ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 12-ఆ కింద 2021 మార్చిలో దాని రిజిస్ట్రేషన్ను రద్దు చేసింది. పీఎఫ్ఐ సంబంధిత సంస్థ రిహాబ్ ఇండియా ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేసింది. ఈ ఆరోపణల నేపథ్యంలో సెప్టెంబర్ 22న ఈడీ, ఎన్ఐఏ దేశవ్యాప్తంగా.. ఏకకాలంలో పీఎఫ్ఐ కార్యాలయాలు, నాయకులు, సభ్యుల ఇళ్లపై పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది. 11 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి 106 మంది పీఎఫ్ఐ సభ్యులను అరెస్ట్ చేశాయి.
ఇక సెప్టెంబర్ 27న ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, అస్సాం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి, పీఎఫ్ఐతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై 150 మందికి పైగా అరెస్టు చేశారు. అయిదు కేసులకు సంబంధించి 45 మందిని అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఇక సోదాల సమయంలో పలు కీలక డాక్యుమెంట్లు, నగదు, పదునైన ఆయుధాలు, పెద్ద సంఖ్యలో డిజిటల్ పరికరాలు లభ్యమైనట్లు వెల్లడించింది. ఈ క్రమంలో తాజాగా కేంద్ర హోం శాఖ పీఎఫ్ఐపై ఐదేళ్ల పాటు నిషేధం విధించింది.