పొరుగు దేశం చైనాను ఓ సమస్య ఇబ్బంది పెడుతోంది. ఆ దేశంలో పెళ్లి కాని ప్రసాద్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అసలు దీనికి కారణాలు ఏంటేంటే..!
ఈ రోజుల్లో మగ పిల్లలకు పెళ్లవడం కాస్త కష్టంగానే మారింది. మంచి ఉద్యోగం, ఆస్తిపాస్తులు ఉన్నా మ్యారేజ్ అవ్వక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. 30 ఏళ్లు దాటుతున్నా మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెడదామంటే కుదరక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య భారత్లోనే కాదు చాలా దేశాల్లో ఉంది. అందుకు చైనా కూడా మినహాయింపేమీ కాదు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా పిలిచే చైనాలో పెళ్లి కాని ప్రసాద్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఆ దేశానికి చెందిన మీడియా సంస్థ వీడో సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఆ సర్వే ప్రకారం చైనాలో పెళ్లవని వారి సంఖ్య 40 కోట్లు అని తెలుస్తోంది.
చైనాలో పెళ్లి చేసుకోని వారు లేదా పెళ్లవని వారి సంఖ్య పెరగడానికి వీడో సర్వే పలు కారణాలను చెప్పుకొచ్చింది. నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉండటంతో 30 ఏళ్లు దాటినా పెళ్లిపై ఎవరూ ఆసక్తి కనబర్చడం లేదట. వివాహం కంటే కూడా కెరీర్ మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారట. కొందరు మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవచ్చని భావిస్తున్నారట. 2022 నాటికే చైనాలో పెళ్లి చేసుకోని యువత 40 కోట్ల మంది వరకు ఉండటంతో రాబోయే రోజుల్లో అది మరింతగా పెరిగేలా కనిపిస్తోంది. అప్పట్లో జనాభా నియంత్రణ కోసం ‘ఒకరే ముద్దు.. ఇద్దరు వద్దు’ అంటూ చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలుతో మరికొన్నాళ్లకు ఆ దేశంలో యువత శాతం గణనీయంగా పడిపోయే చాన్స్ ఉంది.
ఈ నేపథ్యంలో యువతను పెళ్లి చేసుకోమని చైనా సర్కారు ప్రోత్సహిస్తుండటం గమనార్హం. అలాగే లెక్కకు మించి పిల్లల్ని కనాలంటూ ఎంకరేజ్ చేస్తోంది. కావాలంటే నెల రోజులు పెయిడ్ లీవ్స్, ఇతర ప్రోత్సాహకాలు కూడా ఇస్తామంటూ ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తోంది. ఎన్ని ఆఫర్లు ఇచ్చినా చైనాలో వచ్చే పదేళ్లలో పెళ్లి చేసుకోని యువత సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అదే జరిగితే రాబోయే పాతికేళ్లలో అక్కడ వృద్ధుల సంఖ్య కూడా పెరిగి.. యువత, పిల్లల శాతం తక్కువవుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతినే ప్రమాదం ఉందంటూ చైనా మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.