లాటిన్ అమెరికా దేశం చిలీ అడవులను కార్చిచ్చు తగలబెడుతోంది. అక్కడి అడవుల్లో మంటలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. అగ్ని కీలలు రోడ్ల మీదకు దూసుకొస్తున్నాయి. అడవులను మంటలు బూడిద చేస్తున్నాయి. వేడిగాలుల ధాటికి వేల ఎకరాల అటవీ ప్రాంతాలు దగ్ధమవుతున్నాయి. మంటల్లో ఇప్పటివరకు 13 మంది సజీవ దహనమయ్యారు. వీరిలో కొందరు మంటల్లో చిక్కుకుని మరణించగా.. మరికొందరు మంటలను అదుపు తెచ్చే క్రమంలో ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది.
చిలీ రాజధాని నగరమైన శాంటియాగోకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న బయోబయో, నుబుల్ ప్రాంతంలో కార్చిచ్చు ప్రారంభమై దావానలంలా వ్యాపించిందని అధికారులు తెలిపారు. వందలాది ఇళ్లను మంటలు దహించి వేశాయని.. మొత్తం 14 వేల హెక్టార్ల అటవీ ప్రాంతం దహించుకుపోయిందని అధికారులు పేర్కొన్నారు. భారీ గాలులు వీస్తుండటంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయని.. వీటిని అదుపులోకి తెచ్చేందుకు వచ్చిన ఓ హెలికాప్టర్ కూలి పైలెట్ చనిపోయాడని తెలిపారు.
ఈ కార్చిచ్చుతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడిందని, దగ్గర్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే చాన్స్ ఉండటంతో చిలీ ప్రభుత్వం ఎమర్జెన్సీని విధించింది. మరోవైపు కార్చిచ్చు కారణంగా వేడిగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నేషనల్ ఫారెస్ట్రీ కార్పొరేషన్ హెచ్చరించింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.