ఉన్నట్లుండి బ్యాంక్ ఖాతాలో భారీ ఎత్తున డబ్బు పడితే కొందరు బ్యాంక్ వారికి సమాచారం ఇస్తారు. మరి కొందరు మాత్రం.. విలాసాలకు ఖర్చు చేస్తారు. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ అకౌంట్లో 55 కోట్ల రూపాయలు జమ అయిన వార్త చదివాం. తన డబ్బు కాదని తెలిసినప్పటికి సదరు మహిళ.. ఆ మొత్తాన్ని మరో జాయింట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి.. జల్సా చేసింది. ఏకంగా పది కోట్ల రూపాయల ఖరీదు చేసే ఇల్లు నిర్మించింది. ఆఖరికి ఏమైంది.. డబ్బు మొత్తం కట్టమని సదరు సంస్థ ఆదేశాలు జారీ చేసిన వార్త చదివాం కదా. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఓ వ్యక్తి అకౌంట్లో ఏకంగా 4లక్షల కోట్ల రూపాయలు జమ అయ్యాయి. అంత మొత్తం చూసిన వ్యక్తి.. భయంతో ఏం చేశాడో తెలియాలంటే ఇది చదవండి.
ఈ సంఘటన అమెరికా లూసియానాలో చోటు చేసుకుంది. డారెన్ అనే వ్యక్తి అకౌంట్లో కొన్ని రోజుల క్రితం ఒకేసారి 4 లక్షల కోట్ల రూపాయలు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. అలాంటి మెసేజ్ చూస్తే.. ఎవరైనా ముందు ఎగిరి గంతేస్తారు.. ఆ తర్వాత డబ్బను వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి జల్సా చేస్తారు. కానీ డారెన్ మాత్రం భయపడిపోయాడు. వెంటనే తన అకౌంట్లో ఎంత మొత్తం ఉందో చెక్ చేశాడు. 4 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉన్నట్లు చూపించింది. అంటే ప్రపంచ కుబేరుల జాబితాలో 25వ వాడిగా నిలిచేంత మొత్తం అన్నమాట.
అంత భారీ మొత్తాన్ని చూసిన డారెన్.. ‘‘వామ్మో ఇంత మొత్తం నా అకౌంట్లోకి ఎవరు పంపారు.. ఎందుకు.. దీన్ని అలానే వదిలేస్తే లేనిపోని తలనొప్పులు వస్తాయి.. అవసరమా’’ అనుకుని వెంటనే బ్యాంక్కు వెళ్లాడు. సిబ్బందికి విషయం చెప్పాడు. వారు చెక్ చేయగా డారెన్ అకౌంట్లో 4 లక్షల కోట్లు జమ అయినట్లు గుర్తించారు. వెంటనే అతడి ఖాతాను ఫ్రీజ్ చేశారు. రెండు రోజుల తర్వాత అతడి అకౌంట్ నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేశారు. కానీ అసలు డారెన్ అకౌంట్లోకి ఈ మొత్తం ఎలా వచ్చింది.. ఎవరైనా డిపాజిట్ చేశారా.. లేక బ్యాంక్ తప్పిదం వల్ల ఇలా జరిగిందా అనే విషయం మాత్రం తెలియలేదు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.