ఏడాది కాలంగా సాగుతోన్న పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాలు ముగిశాయి. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో పీవీ మార్గ్లో ఉన్న జ్ఞాన భూమిలో శతజయంతి ముగింపు ఉత్సవాలను నిర్వహించారు. వేడుకల్లో భాగంగా 26 అడుగుల పీవీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళ సై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నెక్లెస్రోడ్ను పీవీ మార్గ్గా ప్రకటించారు. అంతేకాకుండా ఈ సందర్భంగా పీవీ నర్సింహారావు రచనలతో రూపొందించిన పుస్తకాలను విడుదల చేశారు. ఎక్కడ ఏ పదవి లభించినా అక్కడ సంస్కరణలను తీసుకొచ్చారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఆయన చిరస్మరణీయులని, రాబోయే తరాలూ గుర్తుంచుకునేలా కాకతీయ యూనివర్సిటీలో ‘పీవీ విద్యా పీఠం’ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఇప్పటికే కేయూ వీసీ పంపించిన ప్రతిపాదనలను ఆమోదిస్తున్నట్టు తెలిపారు.
పీవీ గొప్పతనం గురించి వివరిస్తూ ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు అని ముఖ్యమంత్రి కేసీఆర్ పొగిడారు. పీవీ ఒక కీర్తి శిఖరమని ఆయన హయంలో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలను గుర్తుచేసుకున్నారు. పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించడం పట్ల తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు గవర్నర్ తమిళసై. పీవీ శతజయంతి అందరికీ గొప్ప పండుగని గవర్నర్ అన్నారు. ఆయన రచనలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం హర్ణణీయన్న గవర్నర్ పీవీ రాజకీయాలకు అతీతంగా గౌరవించుకోదగిన వ్యక్తి అని కలాం చెప్పేవారని గుర్తు చేశారు.
పీవీ విద్యానిధి, సాహిత్య పెన్నిధి అని కేసీఆర్ అన్నారు. ఈరోజు దేశానికి కార్పొరేట్ కంపెనీలు రావడానికి, యువతకు విరివిగా ఉద్యోగాలు అందడానికి, రాష్ట్రాల బడ్జెట్ లక్షల కోట్లకు పెరగడానికి కారణం ఆయన ఆర్థిక సంస్కరణలేనని ప్రశంసలు కురిపించారు. పీవీ శతజయంతి ఉత్సవాలను చాలా గొప్పగా నిర్వహించారని కె. కేశవరావును ఆయన అభినందించారు.