హైదరాబాద్- కరోనా చికిత్స విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాకు సంబంధించిన వివిధ రకాల వ్యాధుల్ని ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో చేరుస్తూ కేసీఆర్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మొదటి దశలో కరోనా చికిత్సకు ఆరోగ్యశ్రీ ద్వార కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రమే అందిస్తారు. రెండో దశలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనాకు ఆరోగ్యశ్రీ ద్వార చికిత్స అందించనున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆయుష్మాన్ భారత్ పథకం కింద దేశంలో ఇప్పటికే కరోనాకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో, ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కేవలం ప్రభుత్వ ఆస్పత్రులకు మాత్రమే ఈ పథకాన్ని పరిమితం చేయడంతో కరోనా రోగులకు అయ్యే ఖర్చును ప్రభుత్వం నేరుగా ఆయా ఆస్పత్రులకు అందజేయనుంది.
ఆరోగ్యశ్రీ అంటేనే పేదవారికి కార్పొరేట్ వైద్యమని, అలాంటిది ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయనిపక్షంలో కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ కింద చేర్చి ప్రయోజనమేమిటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోగ్యశ్రీ కింద 2 లక్షల రూపాయల వరకు, ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయల వరకు కవరేజీ ఉంది. కరోనాతో వచ్చే వ్యాధులకు ప్యాకేజీల వారీగా చికిత్స అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, పల్మనాలజీ, క్రిటికల్ కేర్ కేటగిరీల్లో ప్యాకేజీల కింద వైద్య సేవలు అందిస్తారు. కరోనా వైరస్ కారణంగా వచ్చే అన్నిరకాల జ్వరాలకు ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్నారు. నిమోనియా, అక్యూట్ ఫెబ్రిలి ఇల్నెస్, నిర్ధారణ కాని జ్వరం, అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు వచ్చే తీవ్రమైన నిమోనియా, అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు వచ్చే తీవ్రమైన నిమోనియా, ఏ కారణం చేతనైనా శ్వాస ఆగిపోయే పరిస్థితి, ఏ కారణం చేతనైనా శ్వాస ఆగిపోయే పరిస్థితి, తీవ్రమైన స్వైన్ఫ్లూ న్యుమోనియాకు చికిత్స అందిస్తారు.
ఇక స్వైన్ఫ్లూ తీవ్రమై పలు అవయవాలు వైఫల్యం చెందడం, స్వైన్ఫ్లూతో తీవ్రమైన రక్తస్రావం జరగడం, శ్వాసనాళాల ఇన్ఫెక్షన్, శ్వాసనాళాల్లో ఏర్పడ్డ తీవ్రమైన నిమ్ము, స్వైన్ఫ్లూతో తీవ్రమైన రక్తస్రావం, నిమ్ము ఏర్పడటం, ఊపిరితిత్తుల్లో శ్వాసకోశాలు చిట్లిపోవడం, నిమోకోనియోసిస్ ఈ పథకం కింద కరోనా చికిత్స అందనుంది.