న్యూ ఢిల్లీ- భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైదులు తెలిపారు. వారం రోజుల క్రితం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్వల్ప అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ఎయిమ్స్ లో చేర్పించిన టైంలో మన్మోహన్ సింగ్ జ్వరం, నీరసంతో బాధపడుతుండడంతో డాక్టర్లు చికిత్స అందిస్తూవస్తున్నారు.
ఐతే తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో మన్మోహన్ సింగ్ డెంగ్యూతో బాధపడుతున్నట్టు నిర్ధారణ అయిందని వైద్యులు తెలపారు. మన్మోహన్ సింగ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, రక్తంలో ప్లేట్ లెట్ల సంఖ్య క్రమంగా మెరుగుపడుతోందని ఎయిమ్స్ డాక్టర్లు చెప్పారు. ఆయన వ్యక్తిగత వైద్యులు డాక్టర్ నితీశ్ నాయక్ పర్యవేక్షణలో ఎయిమ్స్ డాక్టర్ల టీం ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తోందని తాజా బులెటిన్ లో తెలిపారు.
ఇక మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహూల్ గాంధి సహా పలువురు రాజకీయ ప్రముఖులు ఆకాంక్షించారు. ఈమేరకు ట్విట్టర్ లో పోస్టులు పెట్టారు. మన్మోహన్ సింగ్ భారత్ కు పదేళ్ల పాటు ప్రధానిగా పనిచేశారు. 2004లో మొదటిసారి మన్మోహన్ ప్రధాని అవ్వగా, 2009లో రెండోసారి దేశానికి ప్రధాని అయ్యారు.
ఆయన హయాంలో అనేక ఆర్ధిక సంస్కరణలు తీసుకువచ్చారు. గతంలో పీవీ నరసింహా రావు ప్రధానిగా పనిచేసిన సమయంలో ఆయన క్యాబినెట్ లో మన్మోహన్ సింగ్ ఆర్ధిక మంత్రిగా పనిచేశారు. మన్మోహన్ కు ఆర్ధిక వేత్తగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఆయన త్వరగా కోలుకోవాలని మనము కూడా కోరుకుందాం.