గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. జోరు వానలు, వరదల నేపథ్యంలో వైరల్ జ్వరాలు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, విష జ్వరాలు విజృంభించాయి. కొన్ని రోజుల క్రితం ఏ ఇంట చూసినా జ్వరపీడితులే. ఆస్పత్రులన్ని రోగులతో కిటకిటలాడాయి. డెంగ్యూ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక డెంగ్యూ బారిన పడి పరిస్థితి విషమంగా మారితే.. ప్లేట్లేట్స్ ఎక్కించడం సాధారణంగా జరుగుతుంది. కానీ ఓ ఆస్పత్రిలో మాత్రం వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి.. డెంగ్యూ రోగి మృతికి కారణం అయ్యారు. బాధితుడికి ప్లేట్లెట్లకు బదులు బత్తాయి రసం ఎక్కించారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం ఈ ఘటన మీద సీరియస్ అయ్యింది. చర్యలకు ఆదేశించింది. ఆ వివరాలు..
ఈ సంఘటన ఉత్తరప్రదేశ్, ప్రయాగ్రాజ్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. 30 ఏళ్ల వ్యక్తి డెంగ్యూ బారిన పడ్డాడు. చికిత్స కోసం ప్రయాగ్రాజ్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. డెంగ్యూ చికిత్సలో ప్లేట్లెట్లకు ఎంత ప్రాధాన్యం ఉందో అందరికి తెలుసు. అయితే ఆస్పత్రి సిబ్బంది మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించి.. డెంగ్యూతో బాధపడుతున్న వ్యక్తికి ప్లేట్లెట్స్కి బదులు బత్తాయి రసం ఎక్కించారు. దాంతో అతడు చనిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది. సదరు ఆస్పత్రి మీద పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు నెటిజనులు.
प्रयागराज में मानवता शर्मसार हो गयी।
एक परिवार ने आरोप लगाया है कि झलवा स्थित ग्लोबल हॉस्पिटल ने डेंगू के मरीज प्रदीप पांडेय को प्लेटलेट्स की जगह मोसम्मी का जूस चढ़ा दिया।
मरीज की मौत हो गयी है।
इस प्रकरण की जाँच कर त्वरित कार्यवाही करें। @prayagraj_pol @igrangealld pic.twitter.com/nOcnF3JcgP
— Vedank Singh (@VedankSingh) October 19, 2022
ఈ క్రమంలో యూపీ ప్రభుత్వం ఈ సంఘటనను సీరియస్గా తీసుకుంది. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం విచారణకు ఆదేశించింది. కొన్ని అవకతవకలను గుర్తించాం. విచారణ పూర్తయ్యేంత వరకు హాస్పిటల్ను సీల్ చేశాం అని అడిషనల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపినట్లు న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పేర్కొంది. ఇక ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తి పేరు ప్రదీప్ పాండే అని.. అతడికి ప్లేట్లెట్ల బదులు పళ్ల రసం ఎక్కించారని.. అప్పటికే అతడి పరిస్థితి విషమించడంతో.. అతడిని మరో ఆస్పత్రికి తరలించగా.. ఆలోపే అతడు చనిపోయాడని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
దీనిపై సదరు ఆస్పత్రి యాజమాన్యం స్పందిస్తూ.. ‘‘ప్లేట్లెట్లను మరో వైద్య కేంద్రం నుంచి తెప్పించాం. మూడు యూనిట్లు ఎక్కించాక పేషెంట్లో రియాక్షన్ వచ్చింది. ఆ తర్వాత మరో ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది’’ అని తెలిపాడు. ఇక ‘డెంగ్యూ పేషెంట్కు ప్లేట్లెట్లకు బదులు మొసాంబీ జ్యూస్ ఎక్కించిన వైరల్ వీడియో మా దృష్టికి వచ్చింది. హాస్పిటల్ను సీల్ చేసి ప్లేట్లెట్ ప్యాకెట్లను పరీక్షల కోసం పంపించాం’ అని ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం పాఠక్ ట్వీట్ చేశారు.
जनपद प्रयागराज में झलवा स्थित ग्लोबल हॉस्पिटल द्वारा डेंगू मरीज को प्लेटलेट्स की जगह मोसम्मी का जूस चढ़ा देने के वायरल वीडियो का संज्ञान लेते हुए मेरे द्वारा दिये गए आदेशों के क्रम में तत्काल हॉस्पिटल को सील कर दिया गया है एवं प्लेटलेट्स पैकेट को जाँच हेतु भेजा गया है
— Brajesh Pathak (@brajeshpathakup) October 20, 2022