హైదరాబాద్- మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా దూసుకుపోతున్నారు. పురుషులతో పోటీ పడి ఉగ్యోగాలు చేస్తూ కుటుంబాలను పోషిస్తున్నాయి. ఐతే ఉద్యోగాలు చేసే చోట మహిళలకు వేధింపులు తప్పడం లేదు. తోటి పురుష ఉద్యోగులు మహిళా ఉద్యోగినిలను లైంగింక వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో ఉద్యోగాలు చేయాలంటేనే చాలా మంది మహిళలు ఆందోళన చెందుతున్నారు.
తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిని వేధిస్తున్న స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎం. శ్రీనివాస్ ను వెంటనే సస్పెండ్ చేయడంతో పాటు, మాతృశాఖకు పంపించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సంబంధిత ఆరోగ్య విభాగం అడిషనల్ కమిషనర్ బాదావత్ సంతోష్ను ఆదేశించారు.
జీహెచ్ ఎంసీలోని చార్మినార్ జోన్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిని.. ఆరోగ్య విభాగంలో స్టాటిస్టికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న శ్రీనివాస్ గత కొన్ని రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు చీఫ్ మెడికల్ అధికారికి, కొందరు యూనియన్ లీడర్ల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లింది. తాజాగా సోమవారం జీహెచ్ ఎంసీ మేయర్ విజయలక్ష్మిని కలిసి తన గోడు చెప్పుకుంది.
ఈ ఘటనపై మేయర్ విజయలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఉద్యోగిని లైంగిక వేధింపులకు గురిచేసిన శ్రీనివాస్ ను వెంటనే సస్పెండ్ చేయడంతో పాటు, మాతృశాఖకు సరెండర్ చేయాల్సిందిగా అడిషనల్ కమిషనర్ ను ఆదేశించారు. లైంగిక వేధింపుల విషయం తెలిసినప్పటికీ, తగిన విధంగా స్పందించని చీఫ్ మెడికల్ ఆఫీసర్పై మేయర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. జీహెచ్ఎంసీలోని 30 సర్కిళ్లకు గాను 15 సర్కిళ్లకు శ్రీనివాస్ స్టాటిస్టికల్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. సదరు మహిళా ఉద్యోగి కోసం శ్రీనివాస్ తరచూ చార్మినార్ జోన్కు వెళ్లేవాడని తెలుస్తోంది.