ఈ లోకంలో ఎవరికైనా తల్లిదండ్రులను మించిన అండ ఉండదు. వారుంటే జీవితంలో అన్నీ ఉన్నట్టే. అన్నీ కష్టాలలో నాన్న తోడుగా ఉండి మనలో దైర్యం నింపుతాడు. ఎన్నో విషయాలను నేర్పిస్తాడు. ఇక అమ్మ ప్రేమ వెల కట్టలేనిది. ఆమె ఒడిలో దొరికే ప్రశాంతత ఇంకెక్కడ దొరుకుతుంది? ఇందుకే తల్లిదండ్రుల గొప్పతనం తెలియాలంటే, వాళ్ళు లేని వారిని అడగాలి అంటారు. అమ్మ ప్రేమ కోసం, నాన్న తోడు కోసం వారు ఎంతలానో బాధపడుతూ ఉంటారు. అందుకే వారి జీవితం చాలా దుర్లభంగా ఉంటుంది. కాగా.., సికింద్రాబాద్ శివాజీనగర్లో లోకం తెలియని ఇద్దరు చిన్నారులు ఇప్పుడు ఇలానే అనాధలు అయ్యారు. ఆ వివరాల్లోకి వెళ్తే.., వరలక్ష్మి ఆమె భర్త చాలా ఏళ్ళ క్రితం బతుకుదెరువు కోసం భాగ్య నగరానికి వలస వచ్చారు. సికింద్రాబాద్ శివాజీనగర్లో నాలా పక్కన గుడిసె వేసుకుని ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తూ వచ్చారు ఈ జంట. ముత్యాల్లాంటి ఇద్దరు కొడుకులను ఇచ్చాడు దేవుడు. వారిని చదివిస్తే మన తలరాత మారిపోద్దని సంబర పడేవాడు ఆ తండ్రి. కానీ.., విధి వీరి జీవితాలను అనుకోని మలుపు తిప్పింది. విద్యుత్ షాక్తో వరలక్ష్మి భర్త ఐదు ఏళ్ళ క్రితం చనిపోయాడు.
అప్పటి నుండి దైర్యం కోల్పోకుండా ఇద్దరు కొడుకులు అనిల్, మహేశ్ లను పోహించుకుంటూ వచ్చింది వరలక్ష్మీ. ఇద్దరు పిల్లలూ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. కనీసం ఇలా అయినా బతుకుతున్నాములే అనుకుని, కూలి పనులకు వెళ్తూ పిలల్లని ఉన్నంతలో బాగానే చూసుకుంటూ వచ్చింది. కానీ.., గత కొంత కాలంగా వరలక్ష్మీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఎన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. తాను బ్రతికి ఉండి.. బిడ్డలను చాక్కోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ.., దేవుడు కనికరించలేదు. కొంత కాలంగా అనారోగ్యం తీవ్రం అవ్వడంతో వరలక్ష్మీ కన్ను మూసింది. దీంతో పదేళ్ల వయసు కూడా లేని ఇద్దరు చిన్నారులు అనాధలయ్యారు. రోజు స్నానం చేయించి, తలదువ్వి, గోరు ముద్దలు తినిపిస్తే హాయిగా ఆడుకుని అమ్మ ఒడిలో ఆదమరచి నిదురపోయే ఆ చిన్నారులకు అమ్మ కూడా దూరం అవ్వడం అందరిని కలచి వేసింది. అమ్మ లేదని, తిరిగి రాదని కూడా తెలియని వయసు వారిది. తల్లి మృతదేహాం పక్కనే ఉన్న చిన్నారులను చూసిన ప్రతి ఒక్కరి హృదయాలు బరువెక్కాయి. దీంతో.., విషయం తెలుసుకున్న మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక చిన్నారులను ఓదార్చి అంత్యక్రియల ఖర్చుల కోసం డబ్బులు ఇచ్చారు. పది రోజుల కార్యక్రమం తర్వాత.., పిల్లలని ప్రభుత్వ వసతి గృహంలో చేర్పించి వసతి, చదువుకొనే ఏర్పాటు చేస్తానని భరోసా ఇచ్చారు. కాగా., ప్రభుత్వం ఆ చిన్నారులను ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మరి.. అతి చిన్న వయసులో వీరికి వచ్చిన కష్టంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.