స్విట్జర్లాండ్, దావోస్ వేదికగా ప్రతి ఏటా జనవరి నెలలో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా దావోస్ వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశం జరుగనుంది. ఈ సమావేశాలు జనవరి 16 నుంచి 20 వరకు.. ఐదు రోజుల పాటు జరగనున్నాయి. ఈ సదస్సుకు ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, నిపుణులు, విద్యావేత్తలు, పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు హాజరై తమ దేశాలకు, రాష్ట్రాలకు పెట్టుబడులు వచ్చేలా ప్రమోట్ చేసుకుంటారు. ఈ సమావేశాలకు ఏపీకి ఆహ్వానం అందలేదన్నట్లుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.
ఈ విషయంపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకి ఆహ్వానం అందలేదన్న విమర్శలను ఖండించింది. రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేక కొంత మంది కావాలనే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఈ మేరకు దావోస్ నుంచి వచ్చిన ఇన్విటేషన్ ను ఏపీ ఫ్యాక్ట్ చెక్ పేరిట విడుదల చేసింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నుంచి గతేడాది నవంబర్ లోనే ఆహ్వానం అందిందని అందుకు సంబంధించిన ఆహ్వాన లేఖని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది.
Certain sections of Social Media and Few web based “neutral news” portals are spreading this misinformation on, Andhra Pradesh not being invited to World Economic Forum Summit in Davos.
This is completely untrue. The official invitation is attached with this tweet. pic.twitter.com/UQe93IsqaZ
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) January 17, 2023
గతేడాది దావోస్ సమ్మిట్కు సీఎం జగన్ నేతృత్వంలోని బృందం హాజరైన సంగతి తెలిసిందే. పలువురు పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు జరిపిన ఏపీ ప్రభుత్వ అధికారులు, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించి ఇన్వెస్ట్ చేయాల్సిందిగా ఆహ్వానించారు. ఈ క్రమంలో పలు కంపెనీలు, సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఎంవోయూలు కూడా కుదర్చుకుంది. తాజాగా, గ్రీన్ ఎనర్జీకి సంబంధించి రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులతో అదానీ, గ్రీన్కో, అరబిందో వంటి దిగ్గజ సంస్థలతో రూ.1.25 లక్షల కోట్ల మేర ఒప్పందాలు కుదుర్చుకుంది.
కాగా, ఈ ఏడాది జరుగుతోన్న దావోస్ సదస్సుకు ఏపీ నుంచి ఎవరూ హాజరుకాకపోవటంతో… రాష్ట్రానికి ఆహ్వానం అందలేదన్న ప్రచారం మొదలైంది. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు రాష్ట్రానికి ఆహ్వానం అందలేదని.. పిలిచినా దండగే అనుకుని ఉంటారని టీడీపీ నేతలు విమర్శించారు. ఈ నేపథ్యంలో అసత్య ప్రచారాలను ఖండిస్తూ ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ పేరిట దావోస్ ఇన్విటేషన్ లెటర్ ను విడుదల చేసింది. కాగా, ఈ సమావేశాలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రత్యేక ప్రతినిధి బృందంతో వెళ్లిన సంగతి తెలిసిందే.