అత్త ఒకింటి కోడలే అన్న సామెతను మర్చిపోతున్నారు అత్తలు. కోడలిగా ఉన్న సమయంలో అత్త పెట్టిన వేధింపులను.. తమ కోడలి విషయంలో ఆచరించకూడదని భావిస్తుంటారు అత్తలు.. కానీ వారికి అత్త హోదా వచ్చేసరికి .. ఇంటికి వచ్చిన ఆడపిల్లల్లి రాచి రంపాన పెడుతున్నారు. వరకట్న వేధింపులే కాకుండా పలు కారణాలతో వారిని హింసిస్తున్నారు. తాజాగా కోడలిని హత్య చేసేందుకు ప్రయత్నించిందో అత్త.
ఎంతో అల్లారు ముద్దుగా చూసుకున్న ఆడపిల్లల్ని పెళ్లీడు వచ్చాక మరో అయ్య చేతిలో పెడుతుంటారు తల్లిదండ్రులు. కట్టుకున్న భర్త, వారి కుటుంబం కోసం అన్ని వదిలేసి వస్తున్న ఆడ పిల్లలను వేధింపులకు గురి చేస్తున్నారు అత్తింటి వారు. అదనపు కట్నం కోసం రాచి రంపాన పెడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి సాధింపులే. ఏదన్నా రాకపోతే మీ అమ్మ ఏం నేర్పిందంటూ సూటిపోటీ మాటలతో హింసిస్తున్నారు. కూతురిలా చూసుకోవాల్సిన కోడల్ని ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు. భర్త, అత్త, మామ, ఆడపడుచు బంధువులే రాబంధువులుగా మారుతున్నారు. చివరకు మాట వినడం లేదని, పలు అనుమానాలతో కోడల్ని హత్య చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. అటువంటి ఘటనే తమిళనాడులో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కడలూరు జిల్లా వృద్ధాచలంలో ముఖేష్ రాజ్ కుటుంబం నివాసముంటోంది. అతడికి ఏడేళ్ల క్రితం కృతిక అనే యువతితో వివాహం అయింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. ముఖేష్ రాజ్ అతడి అమ్మ ఆండాళ్తో కలిసి ఉంటున్నారు. ముఖేష్ తిరుప్పూర్లోని అవినాసిలో ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అక్కడే ఉంటూ సెలవులకు ఇంటికి వస్తూ ఉంటాడు. అయితే కోడలి కృతిక ప్రవర్తనపై అత్తకు అనుమానం ఏర్పడింది. ఈ విషయంపై వీరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ గొడవలు తారా స్థాయికి చేరడంతో కోడల్ని చంపేయాలని ముఖేష్ తల్లి భావించింది. ఇంట్లో నిద్రిస్తున్న కోడలిపై యాసిడ్తో దాడి చేసింది అత్త ఆండాళ్.
మరుగు దొడ్లో ఉన్నయాసిడ్ను తీసుకువచ్చి నిద్రిస్తున్న కోడలి శరీర భాగాలపై పోసింది. ముఖం, కళ్లు, చెవులు, ప్రైవేట్ పార్ట్స్ పై పోసింది. అలాగే నోటిలో దోమల మందు పోసి హత్య చేసేందుకు ప్రయత్నించింది. కృతిక అరుపులు, ఏడుపులు విన్న చుట్టుప్రక్కల వారు వచ్చి ఆమెను ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వృద్దాచలం ఆసుపత్రి నుండి కడలూరు ఆసుపత్రికి తరలించారు. యాసిడ్ దాడి చేయడంతో కృతిక కంటిచూపును కోల్పోయింది. శస్త్ర చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించారు. కృతిక ఫిర్యాదుతో అత్త ఆండాళ్ను పోలీసులు అరెస్టు చేసి, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.