అమరావతి- ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు కు మద్య ఏం జరిగింది. ఇద్దరికి ఎక్కడ విభేదాలు వచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామ కృష్ణరాజు.. జగన్ పై ఎందుకు నిప్పులు చెరుగుతూ వస్తున్నారు. సొంత పార్టీ, ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు ఎందుకు గుప్పిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రశ్నలే సామాన్యుల నుంచి కొంత మంది రాజకీయ నేతల మదిలో మెదులుతున్నాయి.
స్వతహాగా వ్యాపారవేత్త అయిన రఘురామ కృష్ణ రాజు నాలుగేళ్ల క్రితం వైెస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో గత ఎన్నికల్లో నర్సాపురం లోక్ సభ స్థానం టిక్కెట్ ను కెటాయించారు వైసీపీ అధినేత జగన్. ఆ ఎన్నికల్లో రఘురామ కృష్ణ రాజు మంచి మెజార్టీతో గెలిచి ఎంపీ అయిపోయారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. రఘురామ కృష్ణ రాజు ఎంపీగా గెలిచిన నెల వరకు బాగానే ఉన్నా.. ఆ తరువాత నుంచి సీఎం జగన్ తో మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఇందుకు ప్రధాన కారణం లోక్ సభలో వైపీసీ ఫ్లోర్ లీడర్ పదవని ఆ పార్టీ నేతలు చెబుతారు.
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత పదవిని రఘురామ కృష్ణ రాజు ఆశించారని, ఆమేరకు ఆపదవిని తనకు కట్టబెట్టాలని జగన్ కు విజ్ఞప్తి చేశారని వైసీపీనేతలు చెబుతున్నారు. ఐతే లోక్ సభ ఫ్లోర్ లీడన్ పదవిని విజయసాయి రెడ్డికి కట్టబెట్టారు సీఎం జగన్. దీంతో అప్పటి నుంచి జగన్ తో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తూ వస్తున్నారు రఘురామ కృష్ణరాజు. ఆ తరువాత ఓ కాంట్రాక్టు విషయంలోను సీఎం జగన్, రఘురామ కృష్ణ రాజుల మద్య విభేదాలు తలెత్తాయట.
దీంతో రఘురామ కృష్ణ రాజు ప్రతి విషయంలోను జగన్ ను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అంతే కాదు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సఖ్యతగా ఉంటున్నారు. ఏకంగా ప్రధాని మోదీని కలిసి ఆయన పాలనపై ప్రశంసల జల్లు కురిపించారు. రఘురామ కృష్ణం రాజు బీజేపీలో చేరలేదు కాని.. బీజేపీ ఎంపీగానే వ్యవహరిస్తూ వలస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు, రఘురామ కృష్ణరాజుకు పూర్తిగా చెడింది. ఇక అవకాశం చిక్కినప్పుడల్లా వైపీసీ పార్టీపైన, సీఎం జగన్ పైన విమర్శలు గుప్పిస్తూ.. ఆరోపణలు చేస్తు వస్తున్నారు. వైసీపీ పార్టీ గుర్తుపై గెలిచి.. ఇప్పుడు వైసీపీకి రెబల్ గా మారి.. జగన్ కు పక్కలె బల్లెంలా మారారు రఘురాం కృష్ణరాజు.