హైదరాబాద్- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో, రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు.
సోమవారం రాత్రి సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి, ఒమిక్రాన్ కేసులు పెరుగుదలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, ప్రభుత్వ సన్నద్ధత సహా తదితర అంశాలపై సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు.
తెలంగాణలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ విధించాల్సిన అవసరం లేదని అధికారులు నివేదిక ఇచ్చినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. కరోనా దృష్ట్యా ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక వసతులు పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి సూచించారు. ఆస్పత్రుల్లో పడకలు, పరీక్ష కిట్లు, మందులు సమకూర్చుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలోని మిగతా పట్టణాల్లో బస్తీ దవాఖానాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇక ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని, అందరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సీఎం కేసీఆర్ సూచించారు. కరోనా కేసుల పెరుగుదల నేపధ్యంలో జనం గుంపులుగా ఉండరాదని, బహిరంగ సభలు, ర్యాలీలు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారును ఆదేశించారు.