న్యూ ఢిల్లీ- దేశంలో పెట్రోల్, డీజిల్ వాహనల రిజిస్ట్రేషలు నిలిపివేస్తున్నట్లు పెత్త ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ క్లారిటీ ఇచ్చారు. మంగళవారం జరిగిన ఓ వర్చువల్ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి, కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను ఇథనాల్, గ్రీన్ హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ వాహనాలను కొనుగోలు చేయడానికి అమ్మకాలను ప్రోత్సాహిస్తున్నట్లు చెప్పారు.
అంతే కాదు విమానయాన ఇంధనంలో 50 శాతం ఇథనాల్ వాడకాన్ని ప్రోత్సహించడానికి కూడా ప్రయత్నిస్తున్నట్లు నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఎలక్ట్రికల్ వాహనాల అమ్మకాలు పెరిగాయని, ప్రజల నుంచి ఈవీ వాహనాల పట్ల మంచి స్పందన వస్తోందని రోడ్డు రవాణా, రహదారుల మంత్రి తెలిపారు. దేశంలో 250 కి పైగా స్టార్టప్ లు ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ది కోసం పనిచేస్తున్నాయని, దీంతో ఈవీల తయారీ ఖర్చు తగ్గుతుందని నితిన్ గడ్కరి పేర్కొన్నారు.
ఇక భవిష్యత్తు అంతా గ్రీన్ హైడ్రోజన్ దే అని చెప్పిన గడ్కరి, వచ్చే నెలలో ఒక హైడ్రోజన్ కారు కొనబోతున్నట్లు తెలిపారు. 2019లో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను ప్రోత్సహించడానికి 2025 నాటికి పెట్రోల్, డీజిల్ త్రిచక్ర వాహనాలు, ద్విచక్ర వాహనాల వాడకాన్ని నిషేదించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఆటో మొబైల్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగంపై నిషేధం వల్ల గ్రీన్ ఎనర్జి వాహనాల అమ్మకాలు పెరగవని ఆటోమొబైల్ కంపెనీలు స్పష్టం చేశాయి.
వివిధ ప్రోత్సాహకాలు, పథకాలను అందించడం ద్వారా ఆటోమొబైల్స్ అమ్మకాల్లో గ్రీన్ ఎనర్జి వాహనాల శాతాన్ని పెంచడానికి కృషి చేస్తున్నట్లు నితిన్ గడ్కరీ చెప్పారు. మేము ఎలక్ట్రిక్ వాహనాలు తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను.. అని గడ్కరీ అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగొళ్లపై ప్రజల్లోనే స్పష్టమైన అవగాహన వస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.