పంజాబ్- ఈ కాలంలో దొంగతనాలకు కొదవే లేదు. దేశంలో ఎక్కడో ఓ చోట, ఏదో ఓ దొంగతనం జరుగుతూనే ఉంటుంది. పోలీసులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా దొంగతనాలు మాత్రం ఆగడం లేదు. పైగా ఇప్పుడు జరిగేవన్నీ హైటెక్ దొంగతనాలు. పాత కాలంలోలా దొంగలను ఈజీగా గుర్తు పట్టే అవకాశం లేదు. ఎందుకంటే ఈ కాలం దొంగలు సూటూ బూటూ వేసుకుని మరీ వస్తున్నారు.
అక్కినేని నాగార్జున సినిమా మన్మథుడు సూచిన వారికి హైటెక్ దొంగతనం అర్ధమవుతుంది. ఆ సినిమాలో నాగార్జున, బ్రహ్మానందం ఓ చెప్పుల షాపులో షూ కొనడానికి వెళ్తారు. తీరా షూ వేసుకుని చూశాక, కాస్త రన్నింగ్ చేసి చూస్తామని చెప్పి, అక్కడి నుంచి డబ్బులు ఇవ్వకుండా పరిగెత్తుకుని వెళ్లిపోతారు. ఇదిగో సరిగ్గా ఇలాంటి ఐడియాతోనే పంజాబ్ లో ఓ జంట ఏకంగా బైక్ దొంగతనం చేశారు.
పంజాబ్ లోని జలంధర్లోని శివ ఆటో డీల్ షోరూమ్కు బైక్ కొంటామని ఓ జంట వచ్చింది. షోరూం ఓనర్ సంజీవ్ వారికి బజాజ్ పల్సర్ బైక్ చూపించి దాని ధర, ఇతర విషయాలను చెప్పాడు. అంతా విన్న జంట ఓ సారి బైక్ నడిపి టెస్ట్ డ్రైవింగ్ చేస్తామని అడిగారు. షోరూం ఓనర్ సంజీవ్ టెస్ట్ డ్రైవ్ కు ఓకే చెప్పడంతో వారిద్దరూ ఆ బైక్ను తీసుకెళ్లారు. కానీ బైక్ తీసుకెళ్లిన జంట ఎంతసేపైనా మళ్లీ తిరిగి రాలేదు.
దీంతో వారు బైక్ తో చెక్కేశారని షోరూం ఓనర్ కు అర్దమైపోయింది. దీంతో ఇక చేసేది లేక పోలీసులకు పిర్యాాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు షోరూంలని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని ఆ జంట కోసం గాలిస్తున్నారు. ఏంటీ మన్మధుడు సినిమా సీన్ ఇప్పుడైనా గుర్తుకు వచ్చిందా.