డబ్బు సంపాదించాలని అందరికీ ఉంటుంది. అందుకోసం కచ్చితంగా అవకాశాలను వెతుకుతూ ఉంటాం. అయితే ఎలా వెతుకుతున్నాం? ఎవరిని సంప్రదిస్తున్నాం? ఎలాంటి పని చేయాలని చూస్తున్నాం? అనే ప్రశ్నలకు మీకు కచ్చితంగా సమాధానం తెలిసి ఉండాలి. లేని పక్షంలో ఎవరో విసిరే వలలో మీరు చిక్కుకోక తప్పదు.
ఈ రోజుల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోయింది. నగరాలు, పట్టణాలు అయితే ఇంక చెప్పక్కర్లేదు. ఒక్కళ్లే సంపాదించి కుటుంబాన్ని పోషించాలి అంటే అది దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. కానీ, చాలా కుటుంబాలు ఇప్పటికే ఒకే సంపాదనతో కాలం వెళ్లదీస్తున్నాయి. అలాంటి వారిలో గృహిణులు కూడా ఏదొక పని చేసి భర్తకు సాయం చేయాలి అనుకుంటారు. కుటుంబ పోషణలో తమ వంతు సాయం చేయాలని ఆశ పడతారు. వారిలో తాపత్రయంలో ఎలాంటి తప్పు లేదు. కానీ, తీసుకునే నిర్ణాలు, వేసే అడుగులు వారికే కాదు.. కుటుంబానికి కూడా తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి. ఇప్పుడు అలాంటి మహిళలే లక్ష్యంగా కొత్త మోసాలు జరుగుతున్నాయి.
హౌస్ వైఫ్ గా ఉంటూ మహిళలు కుటుంబాన్ని చక్కదిద్దుతూ ఉంటారు. నిజానికి భర్త సంపాదించడం చేస్తే.. కుటుంబాన్ని నడిపించే బాధ్యతను భార్యలు తీసుకుంటారు. అయితే భర్త కష్టాలు చూడలేక వాళ్లు కూడా ఏదైనా సాయం చేద్దామని ప్రయత్నాలు చేస్తారు. ఏవైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ దొరుకుతాయా అని ఆన్ లైన్ లో సెర్చ్ చేస్తారు. అలా చేయగానే వారికి కొన్ని ప్రకటనలు ప్రత్యక్షం అవుతాయి. వాటిలో ముఖ్యంగా ప్యాకింగ్ కి సంబంధించిన ప్రకటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎలాంటి పెట్టుబడి లేదు, ఇంటి దగ్గరి నుంచే పని చేయడం, కేవలం ప్యాకింగ్ చేస్తే చాలు నెలకు వేలల్లో ఆదాయంఅంటూ ఫేక్ ప్రకటనలు ఇస్తారు.
ఆ ప్రకటనలు చూసి మీరు వారిని సంప్రదిస్తే మీకు వివరాలు చెప్తారు. అందుకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా పంపిస్తారు. రిజిస్ట్రేషన్, జీఎస్టీ, ట్రాన్స్ పోర్ట్ ఛార్జెస్ అంటూ చాలానే లెక్కలు చెబుతారు. మీకు స్టాక్ పంపే ముందు మీ నుంచి కొంత డబ్బు పంపాలని కోరుతారు. ఉదాహరణకు ఇటీవల నగరానికి చెందిన ఓ మహిళ ప్యాకింగ్ కు సంబంధించిన ఒక ప్రకటన చూసి వారిని సంప్రదించింది. వాళ్లు కొన్ని వీడియోలు పంపి ఆమెను నమ్మించారు. ఆ తర్వాత ఛార్జెస్ పేరిట కొంత డబ్బు కట్టాలని కోరారు. ఆమె నమ్మి పలు దఫాల్లో డబ్బు పంపింది. మొత్తం రూ.55 వేలు పంపిన తర్వాత తాము మోసపోయిన విషయాన్ని గ్రహించారు. ఈ మోసాలు హరియాణా కేంద్రంగా జరుగుతున్నట్లు గుర్తించారు. గతేడాది డిసెంబర్ నుంచి తెలంగాణలో కూడా ఈ ప్యాకింగ్ మోసాలు వెలుగు చూస్తున్నాయి.
ఈ రెండు నెలల్లో ఒక్క సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 113 ఆన్ లైన్ మోసాల మీద ఫిర్యాదులు నమోదు అయ్యాయి. వాటిలో ఎక్కువగా ప్యాకింగ్ మోసాలే ఉన్నాయి. ఈ ఫిర్యాదులు చేసిన వాళ్లు మొత్తం రూ.95 లక్షలకు పైగా పోగొట్టుకున్నారు. ఇలాంటి మోసాలపై సైబర్ క్రైమ్ పోలీసులు చైతన్స పరుస్తూనే ఉన్నారు. కానీ, ఇప్పటికీ చాలా మంది సంపాదించాలనే ఆశతో ఇలాంటి వలల్లో చిక్కుకుంటున్నారు. అయితే ఉద్యోగం, ఉపాధి ఇచ్చే వాళ్లు మీకు జీతం ఇస్తారు.. మీ నుంచి డబ్బు ఆశించరు అనే చిన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోగలిగితే ఇలాంటి మోసాలు కచ్చితంగా తగ్గిపోతాయి. ఇలాంటి మోసాల్లో గుడ్డిగా నమ్ముతున్న బాధితులదే తప్పు అంటారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.