అమరావతి- ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తన ఫ్యామిలీ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురికి తాను పెళ్లి చేయలేదని, తనే వెళ్లిపోయి పెళ్లి చేసుకుందని, అందుకే ఆమె భర్త తనకు అసలు అల్లుడే కాదని సోము వీర్రాజు కామెంట్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అసలేం జరిగిందంటే.. సోము వీర్రాజు కూతురు భర్తపై ఓ వ్యవహారంలో తాజాగా చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదైంది. తమ ఆస్తి పత్రాలను ఫోర్జరీ చేసి కొవ్వూరు ఎస్బీఐ బ్యాంకులో వెంకట నరసింహం లోన్ తీసుకున్నారని రాజమండ్రికి చెందిన గద్దె జయరామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొవ్వూరు టౌన్ పోలీస్స్టేషన్లో గత నెల 4న జయరామకృష్ణ ఫిర్యాదు చేయగా, వెంకట నరసింహంపై ఐపీసీ 406, 419, 420, 465 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇంకేముంది ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అల్లుడిపై చీటింగ్ కేసు.. అంటూ మీడియాలో న్యూస్ సంచలనంగా మారింది. ఐతే తన తండ్రితో తనకు సంబంధాలు లేవని సోము వీర్రాజు కుమార్తె సూర్యకుమారి మీడియా తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై సోము వీర్రాజు బుధవారం కీలక కామెంట్స్ చేశారు. తనకు మొత్తం ముగ్గురు కుమార్తెలు ఉన్నారని చెప్పిన సోము వీర్రాజు, ముగ్గురికి పెళ్లిళ్లు అయ్యాయని, కానీ అల్లుళ్లు మాత్రం ఇద్దరేనని అన్నారు.
ఓ కుమార్తెకు తాను పెళ్లి చేయలేదని, అమ్మాయి పెళ్లిచేసుకుని వెళ్లిపోయిందని చెప్పుకొచ్చారు. అల్లుడికి తాను కాళ్లు కడిగి కన్యాదానం చేయలేదని, అతని క్యారెక్టర్ తనకు నచ్చలేదని సోమువీర్రాజు వ్యాఖ్యానించారు. తన కూతురు భర్తని తాను అల్లుడిగా స్వీకరించలేదని తేల్చిచెప్పారు. అతనితో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన సోము వీర్రాజు, గతంలో అతనిపై పోలీసులకు పిర్యాదు కూడా చేశానని గుర్తు చేశారు. ఈ విషయంలో తన పేరు ప్రస్తావించొద్దని మీడియాకు మనవి చేశారు సోము వీర్రాజు.