ఇప్పుడు దేశవ్యాప్తంగా సెన్సేషన్. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే హాట్ టాపిక్. కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో ఆనందయ్య నాటు మందుతో కరోనా తగ్గిపోతుందన్న వార్త దేశమంతటా పాకి అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్రప్రభుత్వాన్ని కృష్ణపట్నం వైపు చూసేలా చేసింది. ఈ మందును పంపిణీ చేయాలని కూడా ఇటీవలే ఏపీ సర్కార్, హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో టీటీడీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఆనందయ్య మందును టిటిడి ఉద్యోగులకు కూడా పంపిణీ చేయాలని ఈ ప్రక్రియను సోమవారం నుంచి ప్రారంభిస్తామని ఉద్యోగుల సంఘం నేత చీర్ల కిరణ్ పేర్కొన్నారు.
కరోనా కారణంగా టిటిడిలో 35 మంది శాశ్వత ఉద్యోగులు, వంద మంది రిటైర్డ్ ఉద్యోగులు, 10 మంది కాంట్రాక్టు సిబ్బంది మరణించారని ఆయన వెల్లడించారు. టీటీడీ ఉద్యోగులు కరోనా బారిన పడకుండా ముందే ఉద్యోగులకు ఆనందయ్య మందును ఇస్తున్నామని ఆయన ప్రకటించారు. టీటీడీలోని ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు అంటే దాదాపు లక్ష మందికి సరిపడేలా మందును పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఆనందయ్య మందుతో ఎలాంటి ప్రమాదం లేదని ఆయూష్ కమిటీ చెప్పడంతో చాలా మందికి దానిపై నమ్మకం పెరిగింది. ఈ క్రమంలోనే పలువురు ఆనందయ్య మందును వెంటనే డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆనందయ్య మందుపై నిపుణుల అధ్యయనాలు జరుగుతున్నాయి.