ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వ్యవస్థ వాలంటీర్. సేవే ప్రాధాన్యంగా చెప్పబడుతున్న ఈ వ్యవస్థలో వాలంటీర్లు కీలక పాత్ర ధారులు. వితంతు, వృద్ధాప్య వంటి పింఛన్ల కోసం గంటల తరబడి
ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వ్యవస్థ వాలంటీర్. సేవే ప్రాధాన్యంగా చెప్పబడుతున్న ఈ వ్యవస్థలో వాలంటీర్లు కీలక పాత్ర ధారులు. వితంతు, వృద్ధాప్య వంటి పింఛన్ల కోసం గంటల తరబడి కార్యాలయాల ముందు పడిగాపులు కాయకుండా.. ఇంటి వద్దకే ఆ సేవలను అందిస్తున్నారు గ్రామ, వార్డు వాలంటీర్లు. ఒకటో తారీఖున ఠంచనుగా ఇంటి వద్దకే వచ్చి పింఛన్లు అందిస్తున్నారు. అంతేకాకుండా ఇతర సేవలను కూడా గుమ్మం వద్దకే అందిస్తూ అందరితో మన్ననలను పొందుతున్నారు. వీరికి జీతాలు ఉండవు.. రూ. 5 వేలను గౌరవ వేతనం అందిస్తోంది ప్రభుత్వం. ఇప్పుడు వీరి సేవను జగన్ సర్కార్ మరింత గుర్తించనున్నట్లు తెలుస్తోంది.
ఏపీ సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ, అర్హులైన లబ్ధిదారులకు ఆయా పథకాల సేవలను అందిస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటున్న వాలంటీర్ల సేవలు వెలకట్టలేనివి. అవినీతి, వివక్షతకు తావు లేకుండా సేవలు అందిస్తున్న వాలంటీర్ల సేవలను గుర్తించి ప్రతి ఏటా వారికి ప్రభుత్వం ప్రోత్సాహకంగా అవార్డులు కూడా అందిస్తోంది. అయితే వీరికి ఇప్పటి వరకు గౌరవ వేతనం కింద రూ. 5 వేలను అందిస్తుంది ఏపీ సర్కార్. తాజాగా గౌరవ వేతనాన్ని రూ. 5 వేల నుండి రూ. 10 వేలకు పెంచే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దసరా లేదా డిసెంబర్ 21న సీఎం జగన్ పుట్టిన రోజున ఈ ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇంకా ముందుగా ఇచ్చే ఆలోచన కూడా ఉన్నట్లు సమాచారం. దీని వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.30 లక్షల మంది వాలంటీర్లు లబ్దిపొందే అవకాశం ఉంది.