హైదరాబాద్- సేవ చేయడానికి ప్రాంతాలు, సరిహద్దులు ఉండవని.. మంచి మనసు ఉంటే చాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిరూపించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ చిన్నారికి అనారోగ్యం ఉంటే కవిత వెంటనే స్పందించింది. ఆ చిన్నారి వెన్నెముక ఆపరేషన్కు చేయూతనిచ్చి వారి కుటుంబాల్లో సరికొత్త వెలుగులు నింపారు ఎమ్మెల్సీ కవిత. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు చెందిన పదకొండు ఏళ్ల చిమ్మల జ్ఞాపిక అనే చిన్నారి వెన్నెముక సంబంధిత వ్యాధితో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చేరింది. పరీక్షలు జరిపిన డాక్టర్లు ఆమెకు న్యూరో సర్జరీ చేయాలని చెప్పారు. దీంతో నిరుపేద కుటుంబానికి చెందిన జ్ఞాపిక తల్లిదండ్రులకు దిక్కు తోచని స్థితి నెలకొంది. జ్ఞాపిక ఆరోగ్య పరిస్థితి గురించి పలువురు ట్విట్టర్ ద్వారా ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన కవిత జ్ఞాపిక కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి భరోసానిచ్చారు.
నిమ్స్ వైద్యులతో అప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. కవిత ప్రత్యేక చొరవతో నిమ్స్లో సర్జరీ పూర్తి చేసుకున్న జ్ఞాపికసంపూర్ణ ఆరోగ్యంతో నిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయింది. జ్ఞాపిక ఆరోగ్యం కుదుటపడుతోందన్న తల్లిదండ్రులు, అన్ని రకాలుగా అండగా నిలిచిన కవితకు కృతజ్ఞతలు తెలిపారు. ఆపదలో ఉన్నవారికి ఇలాగే మంత్రి కేటీఆర్ కూడా ఎన్నో సార్లు సాయం చేశారు. ఇప్పుడు కవిత కూడా అదేబాటలో నడిచి ఆపన్న హస్తం అందిస్తున్నారు