స్టార్ హీరో అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ పై రోజురోజుకి విమర్శలు పెరిగిపోతున్నాయి. ఇటీవలే ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు పుష్ప హీరో, దర్శకులపై సచనలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా అదే బాటలో టిఆర్ఎస్ నాయకుడు సాయిచంద్ ఓ హైస్కూల్ ప్రోగ్రాంలో పుష్ప సినిమా పై, సినిమా వాళ్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
వివరాల్లోకి వెళ్తే.. ఇటీవలే పుష్ప సినిమా 50రోజులు పూర్తిచేసుకుని 350 కోట్ల క్లబ్ లో చేరింది. తాజాగా ఓ హైస్కూల్ ప్రోగ్రాంలో పాల్గొన్న టీఆర్ఎస్ నేత, తెలంగాణ గాయకుడు సాయిచంద్ తన ప్రసంగంలో భాగంగా పుష్ప సినిమా పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. “పిల్లలకు మాస్కులు లేవు ఏం లేవు.. పక్కపక్కనే కూర్చున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీ టీచర్లదే. అల్లరి చేస్తూ ఉండడంతో పుష్పలో హీరో అనుకుంటున్నాడు వాడు, వాడిని చక్కగా కుర్చోపెట్టండి. ఈ హౌలేగాళ్ళందరినీ తగ్గేదే లేదు అంటూ హీరోలు చేసిన తర్వాత పిలగాళ్లను కంట్రోల్ చేసుడు కష్టమైంది. ఈ సినిమాలను తీసే ఎదవలను చెప్పుతో కొట్టాలి ఫస్ట్” అంటూ ఫైర్ అయ్యారు.
ప్రస్తుతం సాయిచంద్ మాటలపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పుమంటున్నాయి. మీ ప్రసంగంలో పుష్ప సినిమా ఎందుకు వచ్చింది? అంతేగాక సినిమా వాళ్ళను అంత పెద్ద మాటలు అనేముందు ఆలోచించాలి కదా! అంటూ సినీ అభిమానులు, పుష్ప ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి చర్చనీయాంశంగా మారిన టిఆర్ఎస్ నేత మాటలపై అటు పుష్ప టీమ్ లేదా ఇండస్ట్రీ వారు ఎలా స్పందిస్తారో చూడాలి. మరి ఈ నాయకుడి మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.