కోలీవుడ్ లోని టాప్ డైరెక్టర్లలో అట్లీ కుమార్ కూడా ఒకరు. ఎన్నో భారీ చిత్రాలు నిర్మించి.. వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టారు. తాజాగా అట్లీ.. షారుక్ ఖాన్ తో కలిసి బాలీవుడ్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. జవాన్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. టైటిల్ టీజర్ కూడా భారీ అంచనాలను రేకెత్తించింది. అయితే ఇప్పుడు జవాన్ సినిమా చిక్కుల్లో పడినట్లు చెబుతున్నారు. జవాన్ కథ విషయంలో డైరెక్టర్ అట్లీపై ఓ నిర్మాత ఫిర్యాదు చేశారు. ఈ కథ తమదేనని, అట్లీ దానిన కాపీ కొట్టి జవాన్ పేరిట సినిమా నిర్మిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఉత్త ఆరోపణలే కాదు నిర్మాత మండలలిలో ఫిర్యాదు కూడా చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. జవాన్ సినిమా కథ తనదంటూ నిర్మాత మాణిక్యం నారాయణన్ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. తాము 2006లో విజయ్ కాంత్ హీరోగా తెరకెక్కించిన పేరరసు సినిమా కథనే అట్లీ జవాన్ సినిమా పేరుతో హిందీలో నిర్మిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. అయితే ఈ సినిమా షారుక్ ఖాన్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. అటు సౌత్ లో కూడా ఈ సినిమాని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కాపీ రైట్ పేరిట అట్లీ సినిమాకి సమస్యలు తప్పేలా లేవు. అయితే ఈ ఆరోపణలు, ఫిర్యాదుపై అట్లీ స్పందించలేదు. మరి కాపీ ఆరోపణలను ఖండిస్తారా? లేక నేరుగా నిర్మాతల మండలితోనే అట్లీ చర్చిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది.
ఇంక జవాన్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా హీరోయిన్ కోసం మొదట సమంతను అనుకున్నారు. కానీ, చివరకు లేడీ సూపర్ స్టార్ నయనతారను ఫిక్స్ చేశారు. ఈ సినిమాకి సంబంధించి ఒక రోల్ రానాకి ఆఫర్ చేయగా అనారోగ్య సమస్యల వల్ల అతను రిజెక్ట్ చేశాడు. ఆ పాత్రలో విజయ్ సేతుపతి కనిపించనున్నాడు. ఇంక ఈ సినిమాలో ప్రియమణి కూడా నటిస్తోంది. దీపికా పదుకొణె అయితే ఫ్లాష్ బ్యాక్లో షారుక్ ఖాన్ భార్య పాత్రలో క్యామియో చేస్తోందని చెబుతున్నారు. జూన్ 23న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మరి.. ఈ ఫిర్యాదులు సినిమాని ఇబ్బంది పెడతాయా? లేక డైరెక్టర్ అట్లీ ఈ కథ తనదేనని నిరూపించుకుంటాడా? అనే విషయాలు తెలియాలి అంటే వేచిచూడాల్సిందే.